ముంబై : మహారాష్ట్రలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో లాక్డౌన్ అమలు చేస్తున్న ఉద్ధవ్ ఠాక్రే సర్కారు తాజాగా నాగ్పూర్లో లాక్డౌన్ ప్రకటించింది. మార్చి 15 నుంచి 21వ తేదీ వరకు లాక్డౌన్ అమలులో ఉంటుందని, ఈ సమయంలో అత్యవసరమైన సేవలకే అనుమతి ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. పాల దుకాణాలు, కూరగాయాలు, ఇతర ముఖ్యమైన అవసరాలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నాగ్పూర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి వచ్చే అన్ని ప్రాంతాల్లో లాక్డౌన్ అమలులో ఉంటుందని మంత్రి నితిన్ రౌత్ గురువారం పేర్కొన్నారు.
ఆసక్తికరమైన విషయం ఏంటంటే గతేడాది ఇదే రోజున నాగ్పూర్లో మొదటి కరోనా కేసు నమోదైంది. మళ్లీ అదే రోజున లాక్డౌన్ విధించడం గమనార్హం. ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో బుధవారం 13,659 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య దేశంలో రోజువారీ కొత్త కేసుల్లో దాదాపు 60శాతం కావడం గమనార్హం. మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, గుజరాత్, తమిళనాడు సహా ఆరు రాష్ట్రాల్లో గత 24 గంటల్లో నమోదైన కొవిడ్ కేసుల్లో 85.91శాతం ఉన్నాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ గురువారం తెలిపింది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 22,854 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 1,89,226 యాక్టివ్ కేసులున్నాయని, పాజిటివిటీ రేటు 1.68శాతంగా ఉందని మంత్రిత్వశాఖ పేర్కొంది.