హైదరాబాద్: పట్టభద్రుల ఎన్నికల్లో ఓటున్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని మంత్రి కేటీఆర్ కోరారు. ఎన్నికల రోజును సెలవుదినంగా భావించవద్దని, ఓటింగ్లో పాల్గొనకుండా మంచి నాయకులు ఎలా వస్తారని ప్రశ్నించారు. ఓటేయకుండా నేతలను విమర్శిస్తే ఎలాంటి లాభముండదని సూచించారు. ఏరకమైన వ్యక్తులు ప్రజాప్రతినిధులుగా ఉండాలో మీరే తేల్చుకోవాలని చెప్పారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ ఫార్మసీ కాలేజీలో నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవిని భారీ మెజార్టీతో గెలిపించాలని కేటీఆర్ కోరారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు, ఎమ్మెల్యే స్టీఫెన్సన్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో నిత్యం ఘర్షణలుండేవి. ఆరున్నరేళ్లలో కర్ఫ్యూ పెట్టే పరిస్థితి రాకుండా ప్రభుత్వం పనిచేసింది. మహిళలకు తెలంగాణ రాష్ట్రంలో సంపూర్ణ భద్రత కల్పించాం. మౌలిక వసతులపై సీఎం కేసీఆర్ ప్రధానంగా దృష్టిసారించారు. తెలంగాణ ఏర్పడితే కరెంట్ ఉండదని అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్నాడు. రాష్ట్రం ఏర్పడ్డ ఆరు నెలల్లోనే కరెంట్ సమస్యను అధిగమించాం. రైతులకు 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ’ అని కేటీఆర్ పేర్కొన్నారు.