హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): దేశంలోని ప్రభుత్వ కంపెనీలను బీజేపీ అమ్మేస్తున్నదని, రిజర్వేషన్లను ఎత్తేసేందుకు కుట్ర పన్నుతున్నదని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు విమర్శించారు. హైదరాబాద్లోని హోటల్ టూరిజం ప్లాజాలో శనివారం మహబూబ్నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ పట్టభద్రల ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవికి మద్దతుగా పట్టభద్రుల గెట్ టు గెదర్ నిర్వహించారు. సమావేశంలో మంత్రి హరీశ్రావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడు తూ.. ప్రతి ఒక్కరూ ఎందుకు ఓటేస్తున్నామని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. ప్రభుత్వరంగ సంస్థల ఏర్పాటుకు మంత్రిత్వ శాఖ అవసరం కానీ, వాటిని తొలగించేందుకు శాఖ ఏర్పాటు చేసిన ఘనత బీజేపీకి దక్కడం దురదృష్టకరమని అన్నారు.
నీటిపారుదలశాఖలో జీవో 59 తెచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని హరీశ్రావు వెల్లడించారు. ఈ జీవోతో అన్ని ఏజెన్సీల్లో జనాభా ప్రాతిపదికన పనులు కేటాయించే అవకాశం లభించినట్టు చెప్పా రు. బీజేపీ రెచ్చగొట్టే ప్రకటనలు చూసి మోసపోవద్దని, మాయమాటలు నమ్మొద్దన్నారు. ఎస్సీ, ఎస్టీ లు విదేశాలకు వెళ్లి చదివేందుకు ఓవర్సీస్ పథకం కింద రూ.20 లక్షలు అందిస్తున్నామని, దేశంలో ఎక్కడా ఇలాంటి పథకం లేదని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు తీసుకువచ్చిన ఘనత టీఆర్ఎస్కే దక్కుతుందన్నారు. పోటీలో ఉన్న 93 మంది లో వాణిదేవి ఒక్కరే మహిళ అని పేర్కొన్నారు. మహిళలందరూ ఆమెకు ఓటేసి చట్టసభకు పంపించాలని కోరారు.