చెన్నై : త్వరలో జరుగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆరంగేట్రం చేస్తున్న సుప్రసిద్ధ నటుడు కమల్హాసన్.. కొద్దిసేపటి క్రితం తన ఎన్నికల హామీలను ప్రకటించారు. రానున్న ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని కట్టబెట్టినపక్షంలో రాష్ట్రంలో 50 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తానని, ప్రతి యూనిఫాం సెక్టార్ (రాష్ట్ర రంగం) లో మహిళలకు 50 శాతం ఉద్యోగాలు కేటాయించనున్నట్లు కమల్హాసన్ వెల్లడించారు. రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే కమల్హాసన్ తన మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ తరఫున ప్రచారం భాద్యతలను భుజాన వేసుకుని పర్యటనలు ప్రారంభించారు. శానిటరీ న్యాప్కిన్ల పంపిణీ, బాధలో ఉన్న మహిళల సంరక్షణ, ఒంటరి తల్లులకు మద్దతు, మహిళలందరికీ ఉచిత పునరుత్పత్తి ఆరోగ్య పరీక్ష వంటివి కమల్హాసన్ ఇచ్చిన వాగ్దానాల్లో మరికొన్ని.
యువతకు 50 లక్షల ఉద్యోగాలు కల్పించడమే కాకుండా నిరుద్యోగ భత్యాన్ని సవరించనున్నట్లు ఎంఎన్ఎం చీఫ్ హామీ ఇచ్చారు.
తమిళనాడులో 234 మంది సభ్యుల అసెంబ్లీకి ఎన్నికలు ఏప్రిల్ 6 న ఒకే దశలో జరుగనున్నాయి.
ఈ ఎన్నికల్లో కూటమి కోసం ఎంఎన్ఎం పలు పార్టీలతో చర్చలు జరుపుతున్నది. రాష్ట్ర ఎన్నికలకు తన నాయకత్వంలో మూడో ఫ్రంట్ ఏర్పడే అవకాశం ఉన్నదని కమల్హాసన్ ఇటీవల చెప్పారు. అగ్రశ్రేణి నాయకత్వం నుంచి నేరుగా వస్తే డీఎంకేతో పొత్తు ఆహ్వానాన్ని పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే డీఎంకే నుంచి ఆహ్వానం వచ్చిందని, చర్చలు జరిగాయని ప్రతిఒక్కరూ చర్చించుకుంటున్నారు.. కానీ ఎవరూ నేరుగా నా దగ్గరకు రాలేదని కమల్హాసన్ వెల్లడించారు.
మార్చి 7 న ఎంఎన్ఎం అభ్యర్థుల మొదటి జాబితాను ప్రకటించనున్నది.
అధికార ఏఐఏడీఎంకే-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం, డీఎంకే-కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల కోసం పొత్తులు చేసుకుని ప్రచారాలను ప్రారంభించాయి.