బ్రజవిల్లే : తూర్పు కాంగోలో కొందరు దుండగులు జరిపిన కాల్పుల్లో కాంగోలోని ఇటలీ దేశ రాయబారి దారుణహత్యకు గురయ్యాడు. గోమా సమీపంలో ఐక్యరాజ్య సమితికి చెందిన వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం (డబ్ల్యుఎఫ్పీ) కాన్వాయ్పై దుండగులు కాల్పులు జరుపడంతో ఇటలీ రాయబారి లూకా అటనాసియో తీవ్రంగా గాయపడి మరణించాడు. ఈ దాడిలో మరో ఇద్దరు వ్యక్తులు కూడా మరణించినట్లు ఉత్తర కివు ప్రావిన్స్లోని ఆర్మీ ప్రతినిధి మేజర్ గుయిలౌమ్ జైక్ తెలిపారు. మృతులు ఇద్దరూ రాయబారి డ్రైవర్, బాడీగార్డ్గా పనిచేస్తున్నారు. లూకా అటానాసియో మరణాన్ని రోమ్లో ఇటాలియన్ విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. ఒక ఇటాలియన్ పోలీసు మరణించినట్లు కూడా వెల్లడించింది.
ఉదయం 10.15 గంటలకు ఐక్యరాజ్య సమితికి సంబంధించిన వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం కాన్వాయి వెళ్తుండగా.. గోమా సమీపంలో దుండగులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. లూకా అటనాసియోను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించగా.. తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడే కుప్పకూలిపోవడంతో దుండగులు పారిపోయారు. తీవ్రంగా గాయపడిన లూకా అటనాసియో అనంతరం తుదిశ్వాస విడిచాడు. ఆయనతో పాటు ఆయన డ్రైవర్, బాడీగార్డ్ కూడా కాల్పుల్లో గాయపడి చనిపోయారు. అయితే, ఈ కాల్పులకు తమదే బాధ్యత అని ఏ సంస్థ కూడా ఇంతవరకు ప్రకటించలేదు. కాల్పులు ఎవరు జరిపారు అనేదానిపై కాంగో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. రువాండా, ఉగాండాతో కాంగో సరిహద్దుల్లో ఉన్న విరుంగా, చుట్టుపక్కల ప్రాంతాల్లో డజన్ల కొద్దీ సాయుధ సమూహాలు కనిపిస్తాయి. పార్క్ రేంజర్లపై పదేపదే దాడులకు తెగబడుతుంటారు. గత నెలలో వీరు జరిపిన ఆకస్మిక దాడిలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. కాగా, కాంగో కిన్సాశాలో ఇటలీ హెడ్ మిషన్గా 2017 నుంచి పనిచేసిన లూకా అటానాసియో.. 2018లో రాయబారిగా నియమితులయ్యారు.