ట్విట్టర్లో కలెక్టర్కు బాలిక ట్వీట్
ఫోన్ను ఇంటికి పంపించిన హరిత
నర్సంపేట, జూలై 14 : నిరుపేద కుటుంబానికి చెందిన ఓ బాలిక ఆన్లైన్ చదువుల కోసం స్మార్ట్ఫోన్ కావాలంటూ ట్విట్టర్లో ట్వీట్ చేసింది. స్పందించిన కలెక్టర్ హరిత స్మార్ట్ఫోన్ను బాలిక ఇంటికి పంపించింది. వివరాల్లోకి వెళ్తే.. నర్సంపేట పట్టణానికి చెందిన మహిమూద్ పాషా ప్రైవేట్ టీచర్గా పనిచేస్తున్నాడు. పాషాకు ఇద్దరు కూతుళ్లు కాగా పెద్ద కూతురు మహిముదా మైనార్టీ రెసిడెన్షియల్ స్కూలో ఇటీవలే పదో తరగతి పూర్తి చేసి పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష కోసం సన్నద్ధమవుతోంది. ఈక్రమంలో ఇంటర్లో జాయిన్ అయింది. నిరుపేద కుటుంబం కావడంతో ఆన్లైన్ తరగతుల కోసం తండ్రి స్మార్ట్ఫోన్ కొనివ్వలేక పోయాడు. దీంతో మహిముదా పై చదువులకు ఆటంకం కలుగకుండా ఉండేందుకు స్మార్ట్ఫోన్ కొనివ్వాలంటూ బంధువుల ట్విట్టర్ అకౌంట్ ద్వారా కలెక్టర్ హరితకు విన్నవించింది. బాలిక కుటుంబ, చదువు తదితర పరిస్థితిపై నివేదికను అందజేయాలని కలెక్టర్ జిల్లా బాలల సంరక్షణాధిరి మహేందర్రెడ్డిని ఆదేశించారు. బాలిక వివరాలను సేకరించి మహేందర్రెడ్డి కలెక్టర్కు నివేదించారు. కలెక్టర్ ఆదేశాలతో రూ. 10వేల విలువైన స్మార్ట్ఫోన్ను కొనుగోలు చేసి నర్సంపేటలో పట్టణంలోని బాలిక ఇంటికి వెళ్లి బాలల సంరక్షణాధికారి స్వయంగా అందించారు.
కలెక్టర్కు రుణపడి ఉంటా : బాలిక మహిముదా
తమ కుటుంబ ఆర్థిక పరిస్థితులను తెలుసుకొని స్మార్ట్ఫోన్ అందించిన కలెక్టర్ హరితకు రుణపడి ఉంటామని బాలిక తెలిపింది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతానని, బాగా చదువుకొని లక్ష్యం దిశగా అడుగులు వేస్తానని చెప్పింది. కార్యక్రమంలో ఛైల్డ్వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ వసుధ, సభ్యురాలు షాహిదా తదితరులు పాల్గొన్నారు.