ములుగుటౌన్, అక్టోబర్8: జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి పీ.భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విజిలెన్స్, మానిటరింగ్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై కలెక్టర్ మాట్లాడుతూ బండారుపల్లిలో గిరిజన భవనం రూ.కోటి 40 లక్షల వ్యయంతో నిర్మించినట్లు తెలిపారు. దీనిలో ఇండోర్ గేమ్స్, షటిల్ కోర్టు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇదే గ్రామ శివారులో ఆరెకరాల స్థలంలో ఆడిటోరియం నిర్మిస్తామని అన్నారు. ములుగులో నిరుపయోగంగా ఉన్న అంబేద్కర్ భవనాన్ని పునరుద్ధరించి ఉపయోగం తేవాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. దళితులకు పంపిణీ చేసిన మూడెకరాల భూములు నీటి వసతులు లేక బీడుగా మారాయని, వాటికి నీటి వసతి కల్పించాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తుల రవిని ఆదేశించారు.
జిల్లాలో గతేడాది నిర్వహించిన సమావేశంలో లేవనెత్తిన అంశాలపై, కొత్తగా జిల్లాలో పెండింగ్లో ఉన్న కేసులు, సమస్యలు, 75 యాక్ట్పై చర్చించారు. భూ సంబంధిత సమస్యలు ఎస్సీలకు మూడెకరాల భూ పంపిణీలో పట్టాలు లేని వాటిని గుర్తించి వాటికి పట్టాలు ఇప్పించే ఏర్పాటు చేయాలని అన్నారు. జిల్లాలోని అసైన్డ్ మూములపై సర్వే చేయించాలని డీఆర్వో రమాదేవిని ఆదేశించారు. జిల్లాకు 11 అంబేద్కర్ కమ్యూనిటీ హాళ్లు మంజూరయ్యాయని, వాటి నిర్మాణాలని స్థల పరిశీలన చేసి తహసీల్దార్లు నివేదికలు పంపిచాలని ఆదేశించారు. ఏటూరునాగారం మండలంలో ఏఎన్ఎం పోస్టుల్లో ఎస్సీ మహిళకు జరిగిన అన్యాయాన్ని పరిశీస్తామని కమిటీ సభ్యలకు తెలిపారు. నిబంధనలు పరిశీలించి సదరు వ్యక్తికి న్యాయం జరిగేలా చూస్తామని అదనపు ఎస్సీ సాయిచైతన్య అన్నారు. సమావేశంలో డీఎంహెచ్వో అప్పయ్య, డీపీవో వెంకయ్య, ఎస్సీ, ఎస్టీ కమిటీ సభ్యులు సుకుమార్, నక్క భిక్షపతి, జన్ను రవి, మహేశ్ నాయక్, సామ్రాజ్యం, ఏన్జీవో, సబంధిత అధికారులు పాల్గొన్నారు.