రెండు రోజుల క్రితం ముసురుతో మొదలై.. భారీ వర్షంతో అతలాకుతలం చేసిన ‘గులాబ్’ తుఫాన్ ప్రభావం ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు. వాన తగ్గి ముప్పు తప్పినా వరద మాత్రం వదలడం లేదు. ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో కొన్ని ప్రాంతాలను అతలాకుతలం చేసింది. మెజార్టీ మండలాల్లో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండగా, లోతట్టు ప్రాంతాలు, లో లెవల్ కల్వర్టులు మునిగి దారులు మూసుకుపోవడంతో జనజీవనానికి ఇబ్బందులు తప్పడం లేదు. మల్హర్ మండలం మల్లారం ఆరె వాగు వంతెన నీట మునగగా, దస్రుమాట్ వద్ద రోడ్డు పైకి వరద చేరి ములుగు మండలం అన్నంపల్లి-పత్తిపల్లి-దేవగిరిపట్నం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక పంట పొలాలన్నీ నీట మునిగే ఉన్నాయి. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో 9 లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తుతుండడంతో కాళేశ్వరం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. పుష్కరఘాట్ వద్ద మంగళవారం సాయంత్రం 11.5 మీటర్ల ఎత్తులో పారుతుండగా, రాత్రికల్లా మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈమేరకు పరివాహక ప్రాంతాలకు హెచ్చరికలు జారీచేశారు. లక్ష్మి(మేడిగడ్డ), సరస్వతి (అన్నారం) బ్యారేజ్ గేట్లు ఎత్తడంతో భూపాలపల్లి జిల్లాలోని పలు మండలాల్లో వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. వెంకటాపూర్ మండలం వెల్తుర్లపల్లి వద్ద రోడ్డుపై నుంచి మోరంచ వాగు ప్రవాహిస్తుండ గా, పంట పొలాలన్నీ మునిగిపోయాయి. జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలంలో యశ్వంతాపూర్ వాగు రోడ్డుపై నుంచి ప్రవహిస్తుండడంతో దారికి ఇరువైపులా ట్రాక్టర్లు నిలిపి అధికారులు రోడ్డును మూసేశారు. దీంతో కుందారం, కిష్టగూడెం, చీటూరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.