చచ్చిపోయిన హీరో బతికి రావడం ఏంటి అనుకుంటున్నారా..? నిజంగా అయితే అది జరగదు కానీ సినిమాల్లో అయితే జరుగుతుంది కదా. అక్కడంతా చావు పుట్టుకలు స్క్రిప్ట్ రాసిన దర్శకుడి చేతుల్లోనే ఉంటాయి. అందుకే ఇప్పుడు కూడా ఓ సినిమాలో చనిపోయిన హీరో పాత్రను మళ్లీ బతికించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెండేళ్ల కింద సైరా సినిమా విడుదలైన అక్టోబర్ 2నే చిరంజీవికి పోటీగా బాలీవుడ్లో మరో సినిమా విడుదలైంది. దానిపేరు వార్. పేరుకు తగ్గట్లు బాక్సాఫీస్ దగ్గర వార్ చేసి చిరంజీవి సైరాను పూర్తిగా ఓడించేసింది. బాలీవుడ్ సూపర్ స్టార్స్ హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్.. ఇద్దరూ కలిసి నటించిన వార్ సినిమా 2019లో సంచలన విజయం సాధించింది. కొన్నేళ్లుగా సరైన విజయం లేని హృతిక్ కు ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కాస్త ఊరటనిచ్చింది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ తెరకెక్కించే ఆలోచనలో పడ్డాడు దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్.
బాలీవుడ్లో సీక్వెల్స్ కొత్త కాదు. ప్రతీకథకు ముగింపు లేకుండా కొనసాగించేలా చూస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ క్రమంలోనే వార్ సినిమాకు కూడా సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇక్కడే చిన్న రిస్క్ ఉంది. వార్ సినిమాలో టైగర్ ష్రాఫ్ చనిపోతాడు. ఆ తర్వాత అతడి మొహాన్ని విలన్ పెట్టుకుని దేశద్రోహం చేస్తుంటాడు. చివరికి హృతిక్, టైగర్ ష్రాఫ్ మొహం పెట్టుకున్న విలన్ మధ్య భీకరమైన పోరు జరుగుతుంది. అందులోనూ టైగర్ చనిపోతాడు. ఇప్పుడు సీక్వెల్లో మరోసారి టైగర్ ష్రాఫ్ను తీసుకోవాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. కానీ చనిపోయిన పాత్రను మళ్లీ తీసుకువస్తే ప్రేక్షకులు ఒప్పుకుంటారా అనేది ఇప్పుడు అనుమానం.
మొదటి భాగంలో ఆ పాత్ర చనిపోయినట్లుగా చూపించినా.. అలా జరగలేదు అని చెప్పడానికి కూడా చాలా స్క్రీన్ ప్లే రాయాల్సి ఉంటుంది. అదంతా జరిగినా కూడా లాజిక్కు అందకపోతే మరిన్ని తిప్పలు తప్పవు. అలాగని టైగర్ ష్రాఫ్ లేకుండా వార్ 2 చేయడం అనేది దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ కు నచ్చడం లేదు. ఏదేమైనా కూడా వార్ సీక్వెల్లో చనిపోయిన హీరోను బతికిస్తారా.. బతికిస్తే ఎలాంటి కథ చెప్పి మళ్లీ ప్రాణాలతో తీసుకొస్తారనేది ఆసక్తికరంగా మారిందిప్పుడు. 2023లో వార్ 2 విడుదల చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు.