భయంకరమైన కోవిడ్ 19 తర్వాత దేశంలో కోలుకున్న సినిమా ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే అది టాలీవుడ్ మాత్రమే. ఈ విషయాన్ని ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. తమిళ, మలయాళ ఇండస్ట్రీలలో ఇప్పటికీ థియేటర్లు పూర్తిస్థాయిలో ఓపెన్ చేయలేదు. స్టార్ హీరోలు కూడా తమ సినిమాలను డిజిటల్ మీడియాలో విడుదల చేస్తున్నారు. దానికి ప్రత్యక్ష నిదర్శనం మోహన్ లాల్ దృశ్యం 2. పక్క ఇండస్ట్రీల్లో పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే తెలుగులో మాత్రం వరస విజయాలు వచ్చాయి.
సంక్రాంతికి రవితేజ క్రాక్.. విజయ్ మాస్టర్ సినిమాలు కాసుల వర్షం కురిపించాయి. ఆ వెంటనే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, జాంబి రెడ్డి లాంటి సినిమాలు బయ్యర్లకు లాభాలు తీసుకురాకపోయినా నష్టాలు మాత్రం తేలేదు. అలాంటి సమయంలో వచ్చిన ఉప్పెన సినిమా అందరి అనుమానాలు పటాపంచలు చేసింది. ఫిబ్రవరి 12న విడుదలైన ఈ సినిమా రూ.100 కోట్ల గ్రాస్ వసూలు చేసి తెలుగు సినిమా పూర్తిగా కోలుకుందనే సంకేతాలను దర్శక నిర్మాతలకు పంపించింది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్.
ఉప్పెన సినిమా విడుదలైన తర్వాత వారానికి అరడజను సినిమాల చొప్పున దాదాపు 25 సినిమాలు విడుదలయ్యాయి. అందులో అల్లరి నరేష్ నటించిన నాంది సినిమా మాత్రమే విజయం సాధించింది. ఇది కూడా కేవలం రూ.5 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. మంచి అంచనాలతో వచ్చిన నితిన్ చెక్ దారుణంగా డిజాస్టర్ అయ్యింది. ఈ వారం విడుదలైన సినిమాలలో కూడా ఏ ఒక్క దానికి సరైన రెస్పాన్స్ రావడం లేదు. పర్లేదు బాగానే ఉన్నాయి.. ఓసారి చూడొచ్చు అనే టాక్ తెచ్చుకున్నా షాదీ ముబారక్, A1 Express లాంటి సినిమాలకు కనీసం ఓపెనింగ్స్ కూడా రాలేదు.
దాంతో నిర్మాతలలో మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి. పెరుగుతున్న కరోనా కేసులు ప్రేక్షకుల్లో మళ్లీ భయం పుట్టిస్తున్నాయా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఏదేమైనా ఉప్పెన లాంటి సంచలన విజయం తర్వాత అలాంటి మరో బ్లాక్ బస్టర్ వచ్చుంటే ఇలాంటి అనుమానాలు వచ్చి ఉండేవి కావు. మరి మార్చి 11న విడుదల కాబోయే శర్వానంద్ శ్రీకారం, శ్రీ విష్ణు గాలి సంపత్, నవీన్ పొలిశెట్టి జాతిరత్నాలు సినిమాలైనా నిర్మాతల భయాన్ని పోగొట్టి.. నమ్మకాన్ని నిలబెడతాయేమో చూడాలి.