ముంబై : పోర్న్ వీడియో రాకెట్ కేసులో వ్యాపారవేత్త రాజ్కుంద్రాను జులై 19న ముంబై పోలీసులు అరెస్ట్ చేసినప్పటి నుంచి మౌనంగా ఉన్న బాలీవుడ్ నటి, రాజ్కుంద్రా భార్య శిల్పా శెట్టి ఎట్టకేలకు నోరు మెదిపారు. గత కొద్ది రోజులుగా ఎన్నో ఆరోపణలు, వదంతులు వ్యాప్తి చేస్తున్నారని, ట్రోలింగ్తో పాటు ప్రశ్నలు సంధిస్తున్నారని ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నందున తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని ఆమె పేర్కొన్నారు.
ఈ వివాదంలోకి తనను లాగుతూ తప్పుడు ప్రచారం చేయవద్దని ఇన్స్టాగ్రాం పోస్ట్లో శిల్పా శెట్టి కోరారు. పోర్న్ రాకెట్ కేసు విచారణలో ఉందని, ముంబై పోలీసులతో పాటు న్యాయవ్యవస్ధ పట్ల తనకు పూర్తి విశ్వాసం ఉందని స్పష్టం చేశారు. ఓ కుటుంబంగా తాము న్యాయపరమైన పరిష్కారాల కోసం అన్వేషిస్తున్నామని, ఓ తల్లిగా తమ కుటుంబం, పిల్లల గోప్యతను గౌరవించి అర్ధసత్యాలు, అసత్యాలను ప్రచారం చేయవద్దని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నానని రాసుకొచ్చారు.
గత 29 ఏండ్లుగా తాను దేశ చట్టాలను గౌరవిస్తూ కష్టించి పనిచేసే ప్రొఫెషనల్గా ఉన్నానని అన్నారు. మీడియా విచారణను తాము కోరుకోవడం లేదని, చట్టం తనపని తాను చేసుకునేలా మనం వ్యవహరించాలని సత్యమేవ జయతే అంటూ ఇన్స్టా పోస్ట్ను ముగించారు.