తెలుగు ఇండస్ట్రీలో ఆ దర్శకుల దారి విభిన్నం. అందరిలా రొటీన్ కమర్షియల్ సినిమాలు చేయడం వాళ్లకు చేత కాదు. రెండు మూడేళ్లకు ఓ సినిమా చేసినా తమదైన మార్క్ కనిపించేలా ఉంటాయి అవి. అలాంటి సీరియస్ దర్శకులు తెలుగులో కొంతమంది ఉన్నారు. యాదృచ్ఛికంగా ఆ దర్శకుల సినిమాలు ఒకే సీజన్లో విడుదల అవుతున్నాయిప్పుడు. వాళ్లే శేఖర్ కమ్ముల, చంద్రశేఖర్ ఏలేటి, దేవా కట్టా. ఇప్పటికే చంద్రశేఖర్ ఏలేటి తెరకెక్కించిన చెక్ సినిమా మార్చి 26న విడుదలైంది. నితిన్ హీరోగా వచ్చిన ఈ సినిమా దారుణంగా నిరాశపరిచింది.
కెరీర్లో తొలిసారి పూర్తిగా కమర్షియల్ పంథాలో ఒక సినిమా చేయబోయి చేతులు కాల్చుకున్నాడు చంద్రశేఖర్. అయినా కూడా ఈయన నుంచి సినిమా రావడం అతని అభిమానులకు సంతోషాన్ని కలిగించే విషయం. అప్పుడెప్పుడో 2015లో మనమంతా సినిమాతో ప్రేక్షకులను పలకరించిన చంద్రశేఖర్ ఏలేటి.. ఆరేళ్ల విరామం తీసుకొని చెక్ సినిమాతో వచ్చాడు.
ఇక ఇదే సీజన్లో రాబోతున్న మరో విలక్షణ దర్శకుడు శేఖర్ కమ్ముల. ఫిదా లాంటి సంచలన విజయం తర్వాత మూడేళ్లకు పైగా విరామం తీసుకొని లవ్ స్టోరీ సినిమాతో ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు శేఖర్ కమ్ముల. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమా విడుదలకు ముందే రూ. 50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
మరోవైపు విలక్షణ సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవా కట్టా రిపబ్లిక్ సినిమాతో జూన్ 4న వస్తున్నాడు. సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాని పూర్తి స్థాయి పొలిటికల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు దేవా. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తోంది. ఏదేమైనా ఒకే సీజన్లో చంద్రశేఖర్ యేలేటి, శేఖర్ కమ్ముల, దేవా కట్ట లాంటి ముగ్గురు విలక్షణ దర్శకుల నుంచి సినిమాలు వస్తుండటంతో అభిమానులు కూడా ఆనందంగా ఫీలవుతున్నారు.