రుద్రమదేవి సినిమా తర్వాత ఇప్పటి వరకు మళ్లీ సినిమా చేయలేదు దర్శకుడు గుణశేఖర్. మధ్యలో కొన్ని సినిమాలు ప్రకటించినా కూడా అవి కార్యరూపం దాల్చలేదు. రానాతో చేయాల్సిన హిరణ్యకశ్యప కూడా ఆగిపోయింది. బడ్జెట్ కారణాల వల్ల ఈ సినిమా ఇప్పట్లో తెరకెక్కడం కష్టమే. ఇలాంటి సమయంలో ఈ మధ్యే శాకుంతలం సినిమాను ప్రకటించాడు ఈ దర్శకుడు. సమంత అక్కినేని ఈ సినిమాలో టైటిల్ రోల్ చేస్తుంది. ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందిప్పుడు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమా కోసం భారీ ఖర్చుతో సెట్స్ నిర్మిస్తున్నారు. పౌరాణిక నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో శకుంతల, దుష్యంతుల ప్రేమకథను ఆవిష్కరించబోతున్నాడు గుణశేఖర్.
మహాభారతంలోని ఆదిపర్వం నుంచి ఈ కథను తీసుకున్నాడు ఈ దర్శకుడు. ఇందులో శాకుంతలగా సమంత నటిస్తుంది ఓకే.. మరి అతి ముఖ్యమైన దుష్యంతుడిగా ఎవరు నటించబోతున్నారనే విషయంపై చాలా రోజులుగా చర్చ జరుగుతుంది. దీనిపై కొందరి పేర్లు వినిపించాయి. తెలుగులోనూ కొందరి పేర్లు అనుకున్నారు. ముఖ్యంగా సమంత లాంటి స్టార్ హీరోయిన్ పక్కన ఎవరైతే బాగుంటారని చాలా రోజులు చూసి ఇప్పుడు ఒకర్ని ఎంపిక చేశాడు దర్శకుడు గుణశేఖర్. అయితే ఆయనెవరో తెలిసిన తర్వాత అభిమానులు షాక్ అవుతున్నారు. ఇందులో మలయాళ హీరో దేవ్ మోహన్ దుష్యంతుడుగా నటిస్తున్నాడు. దీనికి సంబంధించిన మోషన్ పోస్టర్ ను సమంత అక్కినేని విడుదల చేసింది.
కేరళలో ఇప్పుడిప్పుడే నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్న దేవ్ మోహన్.. సమంతతో నటించే అవకాశం అందుకున్నాడు. తెలుగులో ఇంతమంది హీరోలుండగా.. దుష్యంతుడు పాత్ర కోసం మలయాళం నుంచి నటున్ని తెచ్చుకున్నారా అంటూ గుణశేఖర్ను ప్రశ్నిస్తున్నారు అభిమానులు. ఈ సినిమా కోసం దాదాపు రూ.11 కోట్లతో సెట్ల నిర్మాణం జరుగుతుంది. ఈ సినిమాను సొంత బ్యానర్లోనే నిర్మిస్తున్నాడు గుణశేఖర్. పాన్ ఇండియన్ స్థాయిలో అత్యంత భారీగా సినిమాను నిర్మిస్తున్నాడు గుణశేఖర్. 2021లోనే విడుదల కానుంది శాకుంతలం.