ఒకే ఒక్క సినిమాతో ఇండియా మొత్తం తన గురించి మాట్లాడుకునేలా చేశాడు ప్రశాంత్ నీల్. ఎన్నో సినిమాలతో రాని గుర్తింపు కేజీయఫ్ చాప్టర్ 1తో తెచ్చుకున్నాడు ఈయన. 2018 డిసెంబర్లో విడుదలైన కేజీయఫ్ 1 సంచలన విజయం సాధించింది. ఈ సినిమాతో యశ్ను నేషనల్ స్టార్ చేశాడు ప్రశాంత్ నీల్. ఈయన పాన్ ఇండియన్ డైరెక్టర్ అయిపోయాడు. ఈ సినిమాతో యశ్ మార్కెట్ రూ.200 కోట్లకు చేరిపోయింది. ఇప్పుడు రెండో భాగంపై కూడా అంచనాలు అలాగే ఉన్నాయి. కేజీయఫ్ 2 విడుదలకు ముందే ప్రభాస్ సలార్ సినిమా అనౌన్స్ చేసి మరో సంచలనం రేపాడు ఈయన. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్తోనే బిజీగా ఉన్నాడు ప్రశాంత్ నీల్.
ఈ సినిమా కన్నడలో రికార్డులు తిరగరాసిన ఉగ్రం సినిమా రీమేక్ అని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ప్రశాంత్ నీల్ కోసం ఇప్పుడు స్టార్ హీరోలు క్యూ కడుతున్నారు. చాప్టర్ 2 విడుదలకు ముందే ఈయనతో సినిమా కోసం పోటీ పడుతున్నారు. కేజీయఫ్ ఛాప్టర్ 2 జులై 16న విడుదల కానుంది. ఈ సినిమా ఎలా ఉంటుందో కూడా తెలియకుండానే టాలీవుడ్ హీరోలు ప్రశాంత్ మాయలో పడిపోతున్నారు. ప్రభాస్ సలార్ ఏప్రిల్ 14, 2022న విడుదల కానుంది. ఈ సినిమా సెట్స్పై ఉండగానే జూనియర్ ఎన్టీఆర్ సినిమా కూడా ఖరారు చేశాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ప్రశాంత్ నీల్ సినిమా చాలా రోజుల కిందే ప్రకటించారు.
ఈ సినిమా వచ్చే ఏడాది మొదలు కానుంది. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. పక్కా మాస్ ఎంటర్ టైనర్ గా ఈ కథ ఉండబోతుందని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే లైన్ చెప్పడంతో పూర్తి కథను సిద్ధం చేయాలని ప్రశాంత్కు బన్నీ వర్గం చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా తెలుగులో ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో ఒకే సీజన్లో సినిమాలు కమిట్ అవుతూ చరిత్ర తిరగరాస్తున్నాడు ప్రశాంత్ నీల్.