ఇండియాలో ఉన్నవి రెండే రెండు మతాలు. ఒకటి క్రికెట్.. రెండు సినిమా. ఈ రెండూ కలిస్తే కాంబినేషన్ సూపర్ హిట్. కానీ ఈ రెండు పోటీ పడితే దర్శక నిర్మాతలకు చుక్కలే. ఇప్పుడు ఇదే జరుగుతుంది. కరోనా వైరస్ కారణంగా 2020 మొత్తం దారుణంగా నష్టపోయారు నిర్మాతలు. చాలామంది సినిమాలు విడుదల చేయలేక అలాగే బాక్సుల్లో ఉంచుకున్నారు. ఏదో ఇప్పుడు సమయం కలిసి వస్తుంది కాబట్టి సమ్మర్ సీజన్లో దాదాపు పాతిక సినిమాలు విడుదల చేస్తున్నారు తెలుగు నిర్మాతలు. కానీ దానికి ఐపీఎల్ రూపంలో గట్టి పోటీ ఎదురు కానుంది.
ఇది మొదటిసారి కాదు.. ప్రతిసారి సమ్మర్ సీజన్ అంతా సినిమాలపై ఐపీఎల్ దారుణమైన ప్రభావం చూపిస్తుంది. ఈ సారి కూడా అదే జరగబోతుందేమో అని నిర్మాతలు భయపడుతున్నారు. ఏప్రిల్ 9న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 మొదలు కానుంది. తాజాగా షెడ్యూలు కూడా విడుదల చేశారు. సరిగ్గా అదే రోజు పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తున్న వకీల్ సాబ్ సినిమా విడుదల కానుంది. ఐపీఎల్ సీజన్ అంటే మార్నింగ్, మ్యాట్నీ ఎలా ఉన్నా సాయంత్రం మాత్రం టీవీల ముందు అతుక్కుపోతారు యూత్. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. అప్పట్నుంచీ 52 రోజుల పాటు ఐపీఎల్ సందడితో హోరెత్తిపోనున్నాయి.
కచ్చితంగా ప్రతీ మ్యాచ్ రసవత్తరంగా సాగుతుందనడంలో ఆశ్చర్యం లేదు. దాంతో ఇప్పుడు నిర్మాతలకు గుబులు మొదలైంది. ఐపీఎల్ తమ సినిమా వసూళ్లపై ఎక్కడ ప్రభావం చూపిస్తుందో అని టెన్షన్ పడుతున్నారు నిర్మాతలు. ఒక్కటి రెండు కాదు.. ఏకంగా నెలన్నర పాటు సాగనుంది ఈ భారీ క్రికెట్ టోర్నమెంట్. ఇలాంటి టైమ్ లో ముఖ్యంగా ఫస్ట్ అండ్ సెకండ్ షోలకు కలెక్షన్లు తగ్గే ప్రమాదం కూడా ఉంది. గతంలోనూ ఐపీఎల్ పుణ్యమా అని కొన్ని సినిమాలకు వసూళ్లు రాలేదు. ఇప్పుడు కూడా చాలా సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.. మరి ఈ సారి ఐపీఎల్ పోటీ నుంచి మన సినిమాలెలా తట్టుకుంటాయో చూడాలిక..!