అల్లరి నరేష్కు దాదాపు 8 ఏళ్ల తర్వాత వచ్చిన విజయం నాంది. కొత్త కథలకు నాంది పలుకుతూ సీరియస్ నోట్లో ఈయన చేసిన సినిమా సూపర్ హిట్ అయింది. కొత్త దర్శకుడు విజయ్ కనకమేడల తెరకెక్కించిన ఈ చిత్రం ఫిబ్రవరి 19న విడుదలైంది. రెండు వారాల్లో రూ.5 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి సూపర్ హిట్ గా నిలిచింది.
ఇండియన్ పీనల్ కోడ్ లోని 211 సెక్షన్ గురించి నాంది సినిమా ఎక్కువగా చర్చించింది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసిందిప్పుడు. నాంది విడుదలైన రోజు నుంచి కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ దూసుకుపోతుంది. నాని లాంటి హీరోలు అయితే అల్లరి కాదు నాంది నరేష్ అని పిలుస్తున్నారు. పేరు మార్చుకోవాలంటూ సలహాలు కూడా ఇచ్చారు. ఇదిలా ఉంటే ఈ సినిమాను మార్చి 12న ఆహాలో స్ట్రీమ్ చేయబోతున్నారు. అంటే విడుదలైన మూడు వారాల తర్వాత ఆహా విడుదల చేస్తుందన్నమాట.
క్రాక్ సినిమాకు ఫాలో అయిన ఫార్ములానే ఇప్పుడు నాందికి కూడా అప్లై చేస్తున్నారు ఆహా నిర్వాహకులు. ఫిబ్రవరి 19న విడుదలైన నాంది సరిగ్గా 24 రోజుల తర్వాత ఓటీటీలో రానుందన్నమాట. సినిమాకు అద్భుతమైన టాక్ రావడం.. ప్రశంసలు దక్కడంతో కచ్చితంగా డిజిటల్ ప్లాట్ ఫామ్లో కూడా రికార్డు వ్యూస్ అందుకుంటుందని నమ్ముతున్నారు ఆహా మేకర్స్. ఈ సినిమాను మంచి రేటుకే సొంతం చేసుకున్నారు వాళ్లు. శతమానం భవతి దర్శకుడు సతీష్ వేగేశ్న ఈ సినిమాను నిర్మించాడు.