ఏం చెప్పాలి.. ఎంతని భయపెట్టాలి.. అయినా ఎంత భయపెట్టినా కూడా అక్కడేం జరుగుతుంది..? ఇప్పుడు లీకుల విషయంలో ఇండస్ట్రీ నుంచి ఇలాంటి వార్తలే వస్తున్నాయి. ఎందుకంటే ఎంత జాగ్రత్తగా ఉన్నా.. ఎన్ని ముందస్తు చర్యలు తీసుకున్నా కూడా లీకులు మాత్రం ఆగడం లేదు. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మరోసారి భారీ సినిమాకు సంబంధించిన ఫోటోలు లీక్ అయ్యాయి. అదే ప్రభాస్ సలార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈయన నటిస్తున్న సినిమా షూటింగ్ ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ప్రభాస్ వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అన్నింటికి డేట్స్ కూడా ఇచ్చేసాడు. అందులో నాగ్ అశ్విన్ మినహాయిస్తే మిగిలిన మూడు సినిమాలు ఒకేసారి చేస్తున్నాడు ఈయన. ఇప్పటికే రాధే శ్యామ్ షూటింగ్ పూర్తైపోయింది. ఈ చిత్రం 2021 సమ్మర్ తర్వాత విడుదల కానుంది. రాధాకృష్ణ కుమార్ దీనికి దర్శకుడు.
ఈ సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్.. ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల రెగ్యులర్ షూటింగ్స్ కూడా ఇప్పటికే మొదలైపోయాయి. ఓ వైపు ముంబైలో ఆదిపురుష్ మొదలైపోయింది. మరోవైపు తెలంగాణలో మొన్నటి వరకు సలార్ షూటింగ్ జరిగింది. ఈ రెండు సినిమాలు కూడా ఒకేసారి పూర్తి చేయనున్నాడు ప్రభాస్. ఈ క్రమంలోనే సలార్ కాస్త ముందుగానే పూర్తి కానుంది. ఈ సినిమాను సంక్రాంతి 2022కి విడుదల చేయాలని చూస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. దానికి తగ్గట్లుగానే షూటింగ్ జరుగుతుంది కూడా. ఇదిలా ఉంటే సలార్ ఫస్ట్ షెడ్యూల్ అప్పుడే పూర్తైపోయింది. తెలంగాణ పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఆర్జీ3 పరిధిలో సలార్ షూటింగ్ జరిగింది.
ఈ షూటింగ్ కు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు మరో ఫోటో కూడా లీక్ అయింది. బుల్లెట్ పై ప్రభాస్ కూర్చున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వచ్చింది. ఫోటోలు లీక్ కావడంతో దర్శక నిర్మాతలు కూడా షాక్ అయిపోయారు. వాటిని తొలగించాలని ప్రయత్నించినా కూడా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బొగ్గు గని కార్మికుల నేపథ్యంలో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈ సినిమా షెడ్యూల్ పూర్తి అయిపోయినట్లు ఈ మధ్యే చిత్ర దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ షెడ్యూల్లో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేసాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా శృతి హాసన్ నటిస్తుంది. అక్టోబర్ లోపు షూటింగ్ పూర్తి చేస్తామని ప్రకటించాడు ప్రశాంత్ నీల్. ఫిబ్రవరి మూడో వారంలో రెండో షెడ్యూల్ మొదలు కానుంది.