మేడ్చల్, జూలై20(నమస్తే తెలంగాణ): గ్రామాల అభివృద్ధికి మరిన్ని ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మేడ్చల్-మల్కాజిగిరి జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్చంద్రారెడ్డి తెలిపారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో మంగళవారం అధికారులతో జడ్పీ చైర్మన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పల్లెప్రగతి, హరితహారం కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని చెప్పారు. మేడ్చల్ జిల్లాను అభివృద్ధికి ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. పల్లె ప్రగతిలో జరుగుతున్న అభివృద్ధి పనులు 90 శాతం పూర్తయినట్లు పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి పనులకు ప్రభుత్వం పుష్కలంగా నిధులను కేటాయిస్తున్నదని చెప్పారు. గ్రామాల్లో అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులకు సూచించారు. పల్లె ప్రగతిలో జరిగిన అభివృద్ధి , హరితహారంలో నాటిన మొక్కలు సంరక్షణ బాధ్యతపై జిల్లా అధికారులకు సూచనలు చేశారు. పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమాలపై నిర్లక్ష్యం వహించవద్దని అధికారులకు సూచించారు. సమీక్షా సమావేశంలో జడ్పీ సీఈవో దేవసహాయం, జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశ్ , జడ్పీటీసీలు అనితాలాలయ్య, శైలజారెడ్డి, హరివర్ధన్రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.