కుత్బుల్లాపూర్,ఏప్రిల్26: విధి నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యం వీడాలని జోనల్ కమిషనర్ మమత అన్నారు. సోమవారం తెల్లవారుజామునే కూకట్పల్లి జడ్సీ మమత విస్తృతంగా పర్యటించారు. రెండు సర్కిళ్ల ఉప కమిషనర్లు మంగతాయారు, రవీందర్కుమార్లతో పాటు మెడికల్ ఆఫీసర్లు, సిబ్బందితో కలిసి పర్యటించారు. ఆయా ప్రాంతాలను నేరుగా సందర్శించి, పారిశుద్ధ్య కార్మికులతో చర్చించారు. ఆయా ప్రాంతాల్లో పేరుకుపోతున్న చెత్తకుప్పలకు శాశ్వత పరిష్కారం దిశగా చర్చించారు. విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే ఎంతటి వారిపైనా అయినా చర్యలు తప్పవని, ప్రజారోగ్యం పరిరక్షణ దిశగా ప్రతి ఒక్కరు విధుల పట్ల అంకితాభావంతో పని చేసి, కరోనా సమయంలో ప్రజలకు మరింత భరోసాను ఇవ్వాల్సిన బాధ్యత మనపై ఉందని అధికారులకు సూచించారు. ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందించి వారి సమస్యను పరిష్కరించేలా చూడాలని సూచనలు ఇచ్చారు. కుత్బుల్లాపూర్, గాజులరామారం జంట సర్కిళ్ల పరిధిలో అధికారులు అలసత్వం వహిస్తున్నారని, ఎట్టి పరిస్థితిలో నిర్లక్ష్యం చేయరాదని సూచించారు. పారిశుధ్య సిబ్బంది అతిజాగ్రత్తతో పనులు చేపట్టాలని, ఖచ్చితంగా మాస్కులు, గ్లౌజ్ ధరించాలన్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకొని వారికి మరింత భరోసాను ఇచ్చారు.