మేడ్చల్ : మేడ్చల్ జిల్లాలో యాసంగి పంటల వివరాలను పూర్తిగా సేకరించారు.. ఆ తర్వాత ఆ వివరాలను కంప్యూటర్(ఆన్లైన్)లో పొందుపరిచారు. జిల్లా వ్యాప్తం గా సాగు చేస్తున్న పంటలు, సర్వేనంబర్లు, రైతుల వారీగా నమోదు పూర్తి చేశారు. పంటలు చేతికివచ్చే సమయానికి మార్కెట్లో పంటల కొనుగోలుకు ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చేందుకు ఈ పంటల వివరాల సేకరణ చేపట్టామని వ్యవసాయాధికారులు తెలిపారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా ఈ పంటలను కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. ఈ సారి భారీ వర్షాలతో చెరువులు, కుంటలు నిండి భూగర్భజలం మట్టం పెరిగింది. దీంతో గత ఏడాదితో పోలిస్తే యాసంగిలో అధిక విస్తీర్ణంలో పంటలు సాగువుతున్నాయి. గత ఏడాది యాసంగిలో 16,552 ఎకరాల్లో వివిధ పంటలు సాగుకాగా… ప్రసుత్త యాసంగిలో 22,367 ఎకరాల విస్తీర్ణంలో పంటలను సాగు చేస్తున్నట్లు జిల్లా వ్యవసాయాధికారిణి మేరి రేఖ వెల్లడించారు. ఇందులో వరి 13,490 ఎకరాలు, పశుగ్రాస పంటలు 2049 ఎకరాలు, ఇతరత్రా పంటలైన జొన్న, మొక్కజొన్న, గోధుమ, పప్పుదినుసులను సాగు చేస్తున్నారు. కూరగాయలు 2000 ఎకరాలు, వివిధ రకాల పండ్లు 4,110 ఎకరాలులో సాగు అవుతున్నాయి.
పంటల కొనుగోలుపై ప్రత్యేక దృష్ట
వ్యవసాయసాగుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పంటల సాగు అనంతరం కొనుగోలుకు రైతులకు ఇబ్బందులు కలుగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నది. పంటల వివరాల సేకరణ ఆధారంగా కొనుగోలుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తీసుకుంటున్నారు.
కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు
యాసంగిలో అధిక విస్తీర్ణంలో సాగు చేసిన వరిపంట కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గత సంవత్సర యాసంగిలో 12 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయ గా.. ప్రస్తుతం సాగు చేస్తున్న వరి పంటల ఆధారంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. మరో నెల 15 రోజుల్లో వరి కోతకు రానున్నట్లు వ్యవసాయాధికారులు పేర్కొన్నారు. వరి పంట విస్తీర్ణం అంచనాతో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. గత యాసంగిలో జిల్లాలో 16387,240 మెట్రిక్ టన్నుల దాన్యసేకరణ ప్రభుత్వం చేపట్టింది.