ఘట్కేసర్ రూరల్: సమాజ హితం కోరి యజ్ఞాలు చేయడం ద్వారా సత్పలితాలు వస్తాయని చిన్న జీయర్ స్వామి తెలిపారు. మండల పరిధి ఎదులాబాద్ గ్రామంలోని శ్రీ గోదా సమేత రంగ నాయక స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం చిన్న జీయర్ స్వామి విచ్చేశారు. ఆలయ గర్భగుడిలో ఆలయ ధర్మకర్తలు స్వామిజీకి ప్రత్యేక అర్చనలు చేసి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆయన భక్తులనుద్దేశించి మాట్లాడుతూ దేవాలయాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరి మాసంలో రెండు లక్షల కిలోల నెయ్యి 1035 యజ్ఞ కుండలికలతో యాగం చేయనున్నట్లు చెప్పారు. యాగాలు చేయటం ద్వారా వాతావరణంలో మార్పులు సంభవించి వర్షాలు కురుస్తాయని అన్నారు. గోదాదేవి పుట్టిన రోజు సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవటం సంతోషంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, సర్పంచ్ సురేష్, సహకార సంఘం డైరెక్టర్ ధర్మారెడ్డి, ఆలయ ధర్మకర్తలు పాల్గొన్నారు.