దుండిగల్, సెప్టెంబర్ 28: ప్రతిరోజూ అరగంట పాటు శారీక శ్రమ (వ్యాయామం) చేయడంతో పాటు మద్యపాన సేవనం, స్మోకింగ్, మానసిక ఒత్తిడికి దూరంగా ఉంటే గుండె నొప్పి బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ వైద్యశాల డైరెక్టర్ డాక్టర్ ప్రీతిరెడ్డి అన్నారు. ‘వరల్డ్ హార్ట్డే’ను పురస్కరించుకుని సూరారంలోని మల్లారెడ్డి వైద్యశాలలో ‘కనెక్ట్ విత్ హార్ట్’ పేరుతో మంగళవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న వైద్యశాల డైరెక్టర్ డా.ప్రీతిరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం వయస్సుతో సంబంధం లేకుండా వస్తున్న వ్యాధులలో హార్ట్స్ట్రోక్ ముందువరుసలో ఉందన్నారు. సరైన ఆహార నియమాలు పాటిస్తే గుండె ఆరోగ్యంగా ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో వ్యాధిపై సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అవగాహన పెంచేందుకు తమ మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ వైద్యశాలలో వారం రోజుల పాటు ‘వరల్డ్ హార్ట్ డే వారోత్సవాలు’ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డా॥ ప్రకాశ్ అజ్మేరా, డా॥ కమల్ కుమార్ చావ్లా, డా॥ సుధాకర్ రావుతో పాటు పలువురు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.