మేడ్చల్ మండలంలో రెండు తండాలు, మూడు గ్రామాలు ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పడ్డాయి. ఆ పంచాయతీల్లో జరుగుతున్న అభివృద్ధిపై స్థానికులు, నాయకులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక పంచాయతీగా మారకుంటే మా బతుకులు ఘోరంగా ఉండేవని, సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో మౌలికవసతులు సమకూరుతున్నాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తండా నుంచి పంచాయతీలుగా..
మేడ్చల్ మండలంలో రాజబొల్లారం పంచాయతీ నుంచి విడిపోయి రాజబొల్లారం తండా పంచాయతీగా మారింది. అలాగే రావల్కోల్ నుంచి సైదోనిగడ్డ తండా, డబిల్పూర్ నుంచి లింగాపూర్, నూతన్కల్ నుంచి మైసిరెడ్డిపల్లి, కోనాయిపల్లి గ్రామాలు పంచాయతీలుగా మారాయి. పంచాయతీ కేంద్రానికి రెండు, మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామాల్లో పంచాయతీగా ఏర్పడక ముందు పరిస్థితి అధ్వానంగా ఉండేది ఏ సమస్య ఉన్నా ప్రజలు పంచాయతీ చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చేది. దాదాపు అనుబంధ గ్రామాల్లో ఒకటో, రెండు వార్డులు ఉండటం తప్పా, సర్పంచ్గా ఎన్నికైన వారు లేరు. దీంతో అక్కడ అభివృద్ధి మాత్రం జరుగలేదు.
మారిన రూపు రేఖలు…
ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పడటంతో రూపురేఖలు మారాయి. గ్రామ గ్రామాన డంపింగ్యార్డు, వైకుంఠధామం, ఆహ్లాదం కోసం పల్లె ప్రకృతివనం, నర్సరీలు ఏర్పాటయ్యాయి. రెండేండ్లలో ఐదు పంచాయతీలకు పన్నుల రూపంలో రూ.52 లక్షల వరకు సమకూరగా, ఆర్థిక సంఘం నుంచి జనాభా ప్రాతిపదికన ఒక్కో పంచాయతీకి ఏడాదికి రూ.5 లక్షల నుంచి 12 లక్షల వరకు వచ్చాయి. ఇక ఎంపీపీ, జడ్పీటీసీ, ప్రభుత్వం ఇతర నిధుల నుంచి దాదాపు ఒక్కో పంచాయతీకి రెండేండ్లలో రూ.40 లక్షల వరకు సమకూరాయి. దీంతో ప్రతి పంచాయతీకి హరితహారంలో నాటిన మొక్కల పరిరక్షణకు ట్రాక్టర్, ట్యాంకర్, చెత్తను ఎత్తిపోయడానికి ట్రాలీలను కొనుగోలు చేశారు. అండర్గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లు, నీరు తదితర మౌలిక సదుపాయాలను కల్పించారు.
తొలగిన ఇబ్బందులు ..
మా తండాను మేమే పాలించుకుంటున్నాం. ఇబ్బందులు లేవు. సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేసుకున్నాం. డంపింగ్యార్డు, శ్మశాన వాటిక ఏర్పాటు చేసుకున్నాం. -మంగ్యానాయక్, సర్పంచ్, రాజబొల్లారం తండా
అభివృద్ధి చేసుకుంటున్నాం
గ్రామంలో డంపింగ్యార్డు, వైకుంఠధామం, పల్లె ప్రకృతివనం ఏర్పాటు చేసుకున్నాం. 40వేల లీటర్ల ఉన్న నీటి ట్యాంకు గ్రామానికి సరిపోకపోవడంతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో 90వేల లీటర్ల నీటి ట్యాంక్ను మంజూరు చేశారు. -బైరి లక్ష్మీసంజీవయ్య, సర్పంచ్ లింగాపూర్
అభివృద్ధికి ప్రాధాన్యత..
లింగాపూర్, రాజబొల్లారం తండా పంచాయతీలకు మండల పరిషత్ నుంచి నిధులను కేటాయించాం. ఆ గ్రామాల్లోని సమస్యలను మంత్రి మల్లారెడ్డి దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి నిధులు మంజూరు చేయాలని కోరాం. సీఎస్ఆర్ నిధులు పంచాయతీలకు ఖర్చు చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాం. – పద్మాజగన్ రెడ్డి, ఎంపీపీ, మేడ్చల్