శేరిలింగంపల్లి, జూలై 17 : ఫోన్లో వీడియోకాల్ మాట్లాడుతూ ప్రమాదవశాత్తు బాల్కనీ పైనుంచి జారి సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతిచెందాడు. మణికొండ గార్డెన్స్ ప్రాంతంలో నివాసముంటున్న సామ్యూల్ సుజిత్(32) సాఫ్ట్వేర్ ఉద్యోగి. అమెరికాలో నివసించే తమ్ముడు అభిషేక్కు ఇటీవల పెళ్లి నిశ్చయమైంది. అక్కడే వివాహం చేయాలనే విషయంపై కుటుంబసభ్యులు శనివారం ఫోన్లో వీడియోకాల్ మాట్లాడుతున్నారు. తొలుత తల్లితో మాట్లాడించిన సుజిత్..ఆ తర్వాత బాల్కనీలోకెళ్లి చర్చిస్తూ రెండో అంతస్థు నుంచి కిందపడ్డాడు. తీవ్రగాయాలు కావడంతో రాయదుర్గంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా కాసేపటికి మృతిచెందాడు.