మేడ్చల్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): వైకుంఠధామాలు మెరిసిపోనున్నాయి. సకల వసతులతో అలరించనున్నాయి. కార్పొరేషన్ పరిధిలో రెండు చొప్పున వైకుంఠధామాలను విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మేడ్చల్ జిల్లాలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని వైకుంఠధామాలకు రూ.17 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో జిల్లాలోని పీర్జాదిగూడ, జవహర్నగర్, బోడుప్పల్, నిజాంపేట్, మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, తూంకుంట, గుండ్లపోచంపల్లి, ఘట్కేసర్, పోచారం, దుండిగల్, కొంపల్లిలోని వైకుంఠధామాలను అధికారులు విస్తరించనున్నారు. భూ సేకరణతో పాటు టెండర్ల ప్రక్రియ పూర్తి కాగా త్వరలోనే పనులను ప్రారంభించనున్నారు. అంతేకాక ఇందులో మొక్కలు నాటేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రతి వైకుంఠధామంలో వేల మొక్కలు నాటి పచ్చని అందాలతో మెరిపించనున్నారు.
మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా 61 గ్రామ పంచాయతీలు ఉండగా.. 54 గ్రామాల్లో వైకుంఠధామాలు పూర్తి అయ్యాయి. మరో ఆరింటిలో నిర్మాణ దశలో ఉన్నాయి. భారీ వర్షాలు కురుస్తున్నందున నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతుందని అధికారులు తెలిపారు. త్వరలో పనులు పూర్తి చేస్తామని వివరిస్తున్నారు.