కాప్రా, జూన్ 10: రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా ఆడ బిడ్డలున్న పేద కుటుంబాలకు అండగా నిలుస్తున్నదని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. కాప్రా డివిజన్ ఎర్రలలితా ఫంక్షన్ హాల్లో కాప్రా తహసీల్దార్ గౌతంకుమార్ అధ్యక్షతన జరిగిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే బేతి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు స్వర్ణరాజు, సింగిరెడ్డి శిరీష బొంతు శ్రీదేవి, టీఆర్ఎస్ నాయకులతో కలిసి 99 మంది లబ్ధిదారులకు గురువారం చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద కుటుంబాలకు సీఎం కేసీఆర్ పెద్దన్నగా నిలిచారన్నారు.
ఆడపడుచుల పెండ్లికి ఆర్థిక సహాయం అందిస్తూ ఇతర రాష్ర్టాలకు ఆదర్శప్రాయుడిగా నిలిచారన్నారు. కరోనా కష్టాలతో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నప్పటికీ, ఆడబిడ్డలకు ఆర్థిక సహాయం కొనసాగిస్తున్న ముఖ్య మంత్రి పేదల పక్షపాతి అని కొనియాడారు. కార్పొరేటర్ స్వర్ణరాజు మాట్లాడుతూ.. కాప్రా వార్డు కార్యాలయం కోసం సర్వే చేసి స్థలాన్ని వెంటనే కేటాయించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పావనీరెడ్డి, ఉప్పల్ టీఆర్ఎస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎంకే బద్రుద్దీన్, కాప్రా, ఏఎస్రావునగర్, చర్లపల్లి డివిజన్ల టీఆర్ఎస్ అధ్యక్షులు సుడుగు మహేందర్ రెడ్డి, బేతాల బాలరాజు, విద్యాసాగర్, నాయకులు పులిచేరాలు, పి.మణిపాల్రెడ్డి, ఎస్.సోమశేఖర్రెడ్డి, సురేందర్, ప్రభాకర్రెడ్డి, కొండల్గౌడ్, ఎండీ గౌస్, సీతారాంరెడ్డి, బాషా, ఆర్ఐ.శిరీష, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో లబ్ధిదారులు, నాయకులు, ఆహుతులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ సభలో పాల్గొనడం పట్ల నిర్వాహకులు రెవెన్యూ యంత్రాంగం సంతృప్తి వ్యక్తం చేశారు.