ఉప్పల్లోని కల్యాణపురికాలనీ, హైకోర్టుకాలనీ, ఎన్జీఆర్ఐ సమీప కాలనీలు, పలు ప్రాంతాల్లో గురువారం జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి పర్యటించారు. ఈ మేరకు కాలనీవాసుల విజ్ఞప్తులు పరిశీలించి, సమస్యలు తెలుసుకున్నారు. గతంలో వరదలు వచ్చిన క్రమంలో ఎన్జీఆర్ఐ గోడ కూలిపోయి, సమీప కాలనీల్లోకి వరదనీరు చేరింది.. దీంతో కాలనీల్లో చాలా ఇండ్లు ముంపునకు గురయ్యాయి.. అని ఎన్జీఆర్ఐలో వరదనీటి నియంత్రణకు చర్యలు చేపట్టే విధంగా చూడాలని చిలుకానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్ ఈ సందర్భంగా మేయర్ దృష్టికి తీసుకువచ్చారు. కూలిపోయిన ఎన్జీఆర్ఐ ప్రహరీని మేయర్, ఎమ్మెల్యే పరిశీలించారు.
అనంతరం ఎన్జీఆర్ఐ డైరెక్టర్ తివారితో సమావేశమయ్యారు. సమస్య పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించాలని, కాలనీవాసులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. అదేవిధంగా నాచారం హెచ్ఎంటీనగర్కాలనీ- హైకోర్టుకాలనీ, తదితర లింకు రోడ్లను పరిశీలించి, సమస్యలు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేయవద్దన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ ఉపేందర్రెడ్డి, ఉప్పల్ డిప్యూటీ కమిషనర్ అరుణకుమారి, ఈఈ నాగేందర్, అధికారులు, నేతలు పాల్గొన్నారు.