న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ మరోసారి బంపర్ మెజార్టీతో అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిశోర్ ఫలితాల రోజే ఓ బాంబు పేల్చారు. ఇక నుంచి తాను ఎన్నికల వ్యూహాలు రచించబోనని ఆయన స్పష్టం చేశారు. ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బెంగాల్లో బీజేపీ హిందూత్వ కార్డును విరివిగా వాడినా, ఎన్నికల సంఘం చూసీ చూడనట్లు వదిలేసినా.. చివరికి విజయం మాత్రం తృణమూల్నే వరించినట్లు ఆయన చెప్పారు.
ఈ విజయంపై మమతా చాలా సంతోషంగా ఉన్నారని పీకే తెలిపారు. నిజానికి పశ్చిమ బెంగాల్లో బీజేపీకి 100 సీట్ల లోపే వస్తాయని, అంతకంటే ఎక్కువ వస్తే తాను ఎన్నికల వ్యూహకర్త పనికి గుడ్బై చెబుతానని గతంలో పీకే సవాలు విసిరారు. అయితే ఇప్పుడు ఆయన విజయం సాధించినా కూడా ఇక ఆ పని చేయబోనని చెప్పడం విశేషం.