కుత్బుల్లాపూర్,మే12 : ఇంటి ముందు ఉన్న నీటి సంపులో ప్రమాదవశత్తు పడి రెండేళ్ల బాలుడు మృతి చెందిన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం..ఒడిషా రాష్ర్టానికి చెందిన అమర్దాస్, ఎమిన్దాస్ దంపతులు గత పదేళ్ల కిందట బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చారు.
నగర శివారు గుండ్లపోచంపల్లిలోని ఎస్సీ కాలనీలో అద్దెకు నివాసం ఉంటూ రోజువారి కూలీ పనులు చేసుకుంటూ వారి ఇద్దరు పిల్లలతో గడుపుతున్నారు. ఎమిన్దాస్ రోజువారి పనులో భాగంగా ఉదయం పనికి వెళ్లింది. తన భర్త అమర్దాస్ ఇంట్లో తన పదేళ్ల పెద్దకొడుకుతో పాటు కృష్ణదాస్(2)తో కలిసి ఉన్నారు. పెద్దకొడుకు జ్వరం రాగా పడుకొని ఉండగా మధ్యాహ్నం సమయంలో అమర్దాస్ మద్యం సేవించేందుకు బయటకు వెళ్లాడు.
చిన్న కొడుకు కృష్ణదాస్ ఆడుకుంటూ ఇంటి ముందు ఉన్న సంపులో పడి మృతి చెందాడు. బయటకు వెళ్లి తిరిగి వచ్చిన తండ్రి అమర్దాస్కు సంపులో తేలి ఉన్న కొడుకు మృతదేహన్ని చూసి బోరున విలపించడంతో స్థానికుల సహాయంతో బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.