ఉప్పల్, మే 29: వ్యాక్సినేషన్ కేంద్రాల్లో తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని మేడ్చల్-మల్కాజిగిరి కలెక్టర్ శ్వేతామహంతి అన్నారు. సూపర్ స్ప్రెడర్ల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టీకా కేంద్రాలను శనివారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఉప్పల్లోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సందర్శించి, టీకాలు ఇస్తున్న తీరును పరిశీలించారు. వ్యాక్సినేషన్ కేంద్రాలకు కేటాయించిన సిబ్బంది హాజరవుతున్నారా.. లేదా.. అనే విషయంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సిన్ కోసం నమోదు చేసుకున్న వారి వివరాలను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 19 వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలతో నిత్యం సంబంధాలు కలిగిన సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సిన్ను సజావుగా పూర్తిచేయాలన్నారు.
ఆయా కేంద్రాల్లో వసతుల కల్పన, సదుపాయాలను తెలుసుకున్నారు. టీకాలు వేసుకున్నవారు వైద్యుల సలహాలు, సూచనలు పాటించాలని గుర్తు చేశారు. టీకా కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలోని అన్ని వ్యాక్సినేషన్ కేంద్రాల్లో జర్నలిస్టులకు ముందుగా టీకాలు ఇవ్వాలని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలిగించొద్దని వైద్యాధికారులకు, సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్యాంసన్, డీఎంహెచ్వో మల్లికార్జున్రావు, కీసర ఆర్డీవో రవి, ఉప్పల్ మండల తహసీల్దార్ కె.గౌతమ్కుమార్, మేడిపల్లి తహసీల్దార్ ఎస్తేర్ అనిత, తదితరులు పాల్గొన్నారు.
ఉప్పల్: వ్యాక్సినేషన్ను సూపర్ స్ప్రెడర్లు సద్వినియోగం చేసుకోవాలని చిలుకానగర్ కార్పొరేటర్ బన్నాల గీత ముదిరాజ్ అన్నారు. చిలుకానగర్ డివిజన్కు చెందిన సూపర్ స్ప్రెడర్స్కు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ అర్హులైన వారు తప్పక టీకాలు వేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అరుణకుమారి, నేతలు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.
రామంతాపూర్: రామంతాపూర్ టీవీ స్టేషన్ వద్ద పండ్ల వ్యాపారులకు హబ్సిగూడ కార్పొరేటర్ కక్కిరేణి చేతన శనివారం టీకా కూపన్లను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిఒక్కరూ కొవిడ్ నివారణ కోసం టీకా తీసుకొని, జాగ్రత్తలు పాటించాలన్నారు. కరోనా నుంచి బయట పడడానికి టీకా ఒక్కటే మార్గమన్నారు. కార్యక్రమంలో నాయకులు ఎల్లాచారి, సంజయ్ పటేల్, సుమన్రావు, వెంకటేశ్గుప్తా పాల్గొన్నారు.