మేడ్చల్ మే28(నమస్తే తెలంగాణ): నిత్య సేవకులకు ప్రభుత్వం అందిస్తున్న కొవిడ్ టీకాలను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో కలెక్టర్ మాట్లాడుతూ శనివారం టీకాలు ఇవ్వనున్న దృష్ట్యా కరోనా వారియర్స్ సద్వినియోగం చేసుకోవాలన్నారు. అందరికి అందుబాటులో ఉండే విధంగా వాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి సౌకర్యాలను కల్పించినట్లు కలెక్టర్ శ్వేతా మహంతి వివరించారు.
శామీర్పేట, మే 28 : ప్రతి ఒక్కరూ కరోనా టీకాను వేయించుకోవడంతో పాటు కొవిడ్ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ శ్వేతామహంతి సూచించారు. శామీర్పేట మండలంలోని మినీస్టేడియంలో ఏర్పాటు చేసిన టీకా కేంద్రాన్ని శుక్రవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి పేర్లు, ఆన్లైన్ నమోదు, టీకా ఇచ్చే విధానాలపై సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ టీకా సెంటర్లో ప్రతి ఒక్కరి వివరాలను నమోదు చేయాలని సూచించారు. శామీర్పేట టీకా సెంటర్లో 45 సంవత్సరాలు నిండినవారితో పాటు 18 సంవత్సరాలు నిండిన వారికి సైతం టీకాలు వేశామని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ ఎల్లూబాయిబాబు, డీఎంహెచ్వో మల్లికార్జున్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుదర్శన్, డాక్టర్ మనుపప్పన్, సిబ్బంది పాల్గొన్నారు.