మల్కాజిగిరి, జూన్ 4: విడతల వారీగా ప్రజలందరికీ కరోనా టీకాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని వ్యాక్సిన్ విషయంలో ఎవరూ ఎలాంటి అపోహలకు గురికావద్దని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శ్వేతామహంతి అన్నారు. శుక్రవారం ఆమె మల్కాజిగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వ్యాక్సినేషన్ తీరును పరిశీలించారు. వాక్సిన్ ను ప్రజలకు ఏ విధంగా అందిస్తున్నారు, వ్యాక్సినేషన్ తీరు, ఎంతమందికి వేస్తున్నారు, ఎంతమంది సిబ్బంది హాజరయ్యారు అన్న విషయాలను ఆస్పత్రి అధికారుల ద్వారా తెలుసుకున్నారు. ప్రభుత్వం సూచించిన విధంగా ప్రజలకు అందుబాటులో ఉన్న చోట్ల వ్యాక్సిన్ కేంద్రాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఇప్పటికీ ఇంకా టీకాలు వేసుకోని వారు ఆయా ప్రాంతాల్లోని టీకా సెంటర్లకు వెళ్లి టీకాలు వేసుకోవాలని కోరారు.మొదటి డోసు తీసుకున్న తర్వాత రెండో డోసు గురించి ప్రజలకు వైద్యులువివరించాలని కలెక్టర్ సూచించారు. ఆమె వెంట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మల్లిఖార్జున్ రావు తదితరులు పాల్గొన్నారు