ఘట్కేసర్ రూరల్, మే 13: ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని మేడ్చల్ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శ్వేతామహంతి అన్నారు. గురువారం ఘట్కేసర్ మండలం ఏదులాబాద్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డితో కలిసి పరిశీలించారు. ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్లు(కాంటాలు), ధాన్యం గన్నీ సంచులు, రిజిస్టర్లను ఆమె పరిశీలించారు. రైతులు పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. పంట దిగుబడి, ధాన్యం కొనుగోలు, టోకెన్ల పంపిణీ తదితర వాటిని రైతులను అడిగి తెలుసుకున్నారు. ఆన్లైన్ ద్వారా రైతుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమచేయడం జరుగుతుందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జిల్లా వ్యాప్తంగా గన్నీ సంచుల కొరత లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి, జిల్లా కో ఆపరేటివ్ అధికారి పాల్గొన్నారు.