కీసర, మే 4: మేడ్చల్ నియోజకవర్గం నాగారం మున్సిపాలిటీ కేంద్రంలో దారుణం జరిగింది. చేయని తప్పుకు తనను వేదిస్తున్నారనే అవమానంతో తన ఇద్దరు పిల్లలతో సహా.. భార్యాభర్తలు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కీసర పోలీస్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకున్నది. కీసర సీఐ జె.నరేందర్గౌడ్ కథనం ప్రకారం.. యాదాద్రి జిల్లా రాజపేట మండలం రేణుకుంట గ్రామానికి చెందిన పల్ల పు భిక్షపతి, ఉష దంపతులు. బతుకుదెరువు నిమిత్తం గత పదేండ్ల కిందట నాగారంకు వచ్చారు. భిక్షపతి ఆటో డ్రైవర్గా పనిచేస్తూ తన కుటుంబాన్ని పోశించుకుంటున్నాడు. గత నాలుగు నెలల కిందట నాగారంలోని వెస్ట్ గాంధీనగర్కు ఇంటిని మార్చారు.
ఇదిలా ఉండగా.. పక్కనే ఓ ఇంట్లో ఉన్న యువతి పట్ల భిక్షపతి అసభ్యంగా ప్రవర్తించాడని స్థానికులు ఆరోపించడంతో.. పాటు గురువారం రాత్రి భిక్షపతిపై దాడి చేశారు. శుక్రవారం ఉదయం పెద్ద సమక్షంలో మాట్లాడుదామని చెప్పి.. వెళ్లిపోయారు. అయితే కులం పంచాయతీ పెట్టి డబ్బులు వసూలు చేయడానికి స్థానికులు పూనుకున్నట్లు తెలిసింది. యువతిని వేధించినందుకు గాను రూ.5లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసిన్నట్లు సమాచారం. దీంతో అవమానం భరించలేక.. తీవ్ర మనస్తాపానికి గురైన భిక్షపతి తొలుత భార్య ఉష, ఇద్దరు పిల్లలు యశ్వంత్ (10), అక్షిత(7)లకు ఉరివేసిన అనంతరం భిక్షపతి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
శుక్రవారం ఉదయం గమనించిన స్థానికులు కీసర పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గమనించగా.. భార్య, ఇద్దరు పిల్లలు మంచంమీద మృతిచెందిఉండగా.., భిక్షపతి ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. ఈ మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. క్లూస్టీం ద్వారా వివరాలు సేకరించామని సీఐ నాగేందర్గౌడ్ తెలిపారు.
తప్పుడు ఆరోపణలు చేస్తూ.. తనను అవమానించారని, అంతేకాకుండా రూ.5 లక్షలు ఇవ్వాని డిమాండ్ చేస్తున్నారని భిక్షపతి సూసైడ్ నోట్ రాశాడు. అవమానం భరించలేకనే తన భార్య, పిల్లలతో పాటు తానుకూడా ఆత్మహత్య చేసుకుంటున్నానని నోట్లో పేర్కొన్నాడు.