బోడుప్పల్, ఆగస్టు : అక్రమ నిర్మాణాల పట్ల కఠినంగా వ్యవహరించనున్నట్లు బోడుప్పల్ కమిషనర్ బోనగిరి శ్రీనివాస్ వెల్లడించారు. బోడుప్పల్ పరిధిలోని సర్వేనంబర్ 255లోని బయ్యన్నగూడ లేఅవుట్లోని పబ్లిక్ టాయిలెట్స్ కోసం కేటాయించిన 200వందల చదరపు గజాల స్థలాన్ని అన్యాక్రాంతం చేయడానికి కొంత మంది ప్రయత్నించి, రాత్రికి రాత్రే నిర్మాణాలు చేపట్టినట్లు సమాచారం అందిన వెంటనే సిబ్బందిని పంపి పనులు జరగకుండా అడ్డుకున్నట్లు ఆయన తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో అక్రమనిర్మాణాలను ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు.
నగరప్రణాళిక విభాగం అధికారికి కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. నగరపరిధిలో చెంగిచర్ల, బోడుప్పల్, మియాపూర్, బయ్యన్నగూడ ప్రాంతాల్లో కొన్ని నిర్మాణాలు టీఎస్బీపాస్ నిబంధనలు విరుద్దంగా జరుగుతున్నాయని వాటికి భారీ జరిమాన విధించనున్నట్లు వెల్లడించారు.