కాప్రా: కాప్రాసర్కిల్ పరిధిలోని కాప్రా రెవెన్యూగ్రామం సర్వేనంబర్ 152లో గల 13.17 ఎకరాల కస్టోడియన్ భూముల్లో ఫెన్సింగ్ వేసి కొంతమంది తప్పుడు పత్రాలతో అక్రమంగా కబ్జా చేయగా కాప్రా తహసీల్దార్ గౌతమ్కుమార్ ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది గురువారం తెల్లవారు జామున ఫెన్సింగ్ తొలగించి స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రాంతంలో ప్రభుత్వస్థలమని బోర్డులు ఏర్పాటు చేశారు. పోలీసు బలగాలతో గురువారం తెల్లవారుజామున రెవెన్యూ అధికారులు కబ్జాకు గురైన ప్రాంతాల్లో మోహరించారు.
జేసీబీలతో ఫెన్సింగ్ను పూర్తిగా తొలగించారు. ఈ ప్రాంతంలో మొత్తం 70 ఎకరాల కస్టోడియన్ భూములు ఉండగా వాటిలో ప్రభుత్వ సూచికలను పాతినట్టు తహసీల్దార్ గౌతమ్కుమార్ తెలిపారు. ఇన్చార్జి ఆర్డీఓ మల్లయ్య , ఏసీపీ శివకుమార్ల పర్యవేక్షణలో కబ్జాస్థలాల్లోని ఫెన్సింగ్లను, ఇతర అక్రమనిర్మాణాలను తొలగింప జేశారు. తాసిల్దార్ గౌతమ్కుమార్, జవహర్నగర్ సీఐ బిక్షపతిరావు ఆధ్వర్యంలో నిర్మాణాలను తొలగించారు.
కుట్రపూరితంగా తప్పుడు పత్రాలతో కోర్టులను తప్పుదోవపట్టించడమే కాకుండా తహసీల్దార్ పై ఉల్టాకేసు పెట్టడమే కాకుండా, దీనికి రాజకీయరంగు పులిమి ఎమ్మెల్యేను కూడా ఈ వివాదంలోకి లాగడంతో ఈ కేసు ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉన్నతాధికారుల ఆదేశాలతోరెవెన్యూ యంత్రాంగం ఈ కేసులో నిందితులపై పకడ్బందీ చర్యలు చేపట్టినట్టు భావిస్తున్నారు. భూకబ్జాదారులపై రెండు క్రిమినల్ కేసులు నమోదు చేసి ప్రభుత్వ యంత్రాంగం పట్టుబిగించడం పట్ల స్థానికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తహసీల్దార్ గౌతమ్కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వస్థలాలను కబ్జా చేస్తే ఎంతటి వారైనప్పటికీ చట్టప్రకారం కఠినచర్యలు తీసుకుంటామని అన్నారు.