మల్కాజిగిరి : శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు మల్కాజిగిరిలో ఘనంగా జరిగాయి. పలు ఆలయాల్లో శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. మారుతీనగర్లోని ఆంజనేయ స్వామివారి ఆలయంలో గల శ్రీకృష్ణ మందిరం ఉపాలయంలో కృష్ణాష్టమిని సాంప్రదాయబద్దంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు గుండు లక్ష్మణశర్మ, జనమంచి శ్యాంప్రసాద్ శర్మల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
స్వామివారికి రుద్ర నమక, చమక, సహిత పురుషసూక్తం, శ్రీ సూక్తం, మన్యసూక్త సహిత పంచామృతాభిషేకం, పండ్లరసాలు, సుగంద ద్రవ్యాలతో వివేష అభిషేకం, లక్ష తులసిదళాలతో సహస్రనామార్చనలు నిర్వహించారు. మహా హారతి, మంత్రపుష్పంతో కార్యక్రమం ముగిసింది. ఆలయ కమిటీ మాజీ చైర్మన్ రామిశేష్టి రామకృష్ణ నాయుడు దంపతులతో పాటు పలువురు భక్తులు, దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.