చర్లపల్లి, : మహాశివరాత్రి సందర్భంగా కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి జాతరకు సికింద్రాబాద్, హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆర్టీసీ సికింద్రాబాద్ డివిజనల్ మేనేజర్ జగన్ పేర్కొన్నారు. శనివారం కుషాయిగూడ ఆర్టీసీ డిపోలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రామలింగేశ్వర స్వామి జాతరకు 300వందల ప్రత్యేక బస్సులను నడిపించేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. ఈసీఐఎల్, ఆఫ్జల్గంజ్, తార్నాక, రెజిమెంటల్బజార్, ఘట్కేసర్, ఉప్పల్ చౌరస్తా, అమ్ముగూడ, వెస్ట్ వెంకటాపురం ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడిపించడానికి ఏర్పాట్లు చేశామన్నారు.
అదేవిధంగా కీసర నుంచి కీసరగుట్టకు ప్రతి నిమిషానికి బస్సును నడిపిస్తున్నామని పేర్కొన్నారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ పూర్తిగా శానిటైజ్ చేసిన అనంతరం బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేశామని ఆయన వెల్లడించారు. భక్తులు ప్రైవేట్ వాహనాలు, వ్యక్తిగత వాహనాలకు బదులుగా బస్సులో ప్రయాణం సాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కుషాయిగూడ డిపో మేనేజర్ సుధాకర్రావు, చెంగిచర్ల, హకీంపేట, కంటోన్మెంట్, రాణిగంజ్, రాణిగంజ్-2లకు చెందిన డిపో మేనేజర్లు, మెకానిక్ సూపర్వైజర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.