శామీర్పేట, జూన్ 23 : గ్రామాలను ఉత్తమ గ్రామాలుగా తీర్చిదిద్దే బాధ్యత గ్రామ పంచాయతీ పాలకవర్గం, కార్యదర్శులపై ఉందని అదనపు కలెక్టర్ శ్యాంసన్ అన్నారు. మూడుచింతలపల్లి మండల పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం హరితహారం, సీజనల్ వ్యాధులపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరితహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని మల్టీ లెవల్ ప్లాంటేషన్ చేపట్టాలన్నారు. ఇంటర్నల్ రోడ్డులో నాటిన మొక్కలు 80శాతం బతికేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ సభలు నిర్వహించి ప్రజా సమస్యలను పరిష్కరించాలని, దాతల ద్వారా సేకరించిన విరాళాలతో అవసరం ఉన్న యంత్రాలను కొనుగోలు చేయాలన్నారు. కార్యక్రమంలో సీఈవో దేవసహాయం, ఎంపీపీ హారికామురళిగౌడ్, వైస్ ఎంపీపీ శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్ రవి, అడిషనల్ డీఎంహెచ్వో నారాయణ, ఎంపీటీసీలు, సర్పంచ్లు, అధికారులు పాల్గొన్నారు.
కీసర, జూన్ 23 : ప్రభుత్వ పనుల్లో ప్రగతి సాధించాలని జిల్లా అదనపు కలెక్టర్ జాన్ శ్యాంసన్ అన్నారు. మండల పరిధి కరీంగూడలో బుధవారం జిల్లా అదనపు కలెక్టర్ జాన్ శ్యాంసన్, సర్పంచ్ కౌకుట్ల గోపాల్రెడ్డితో కలిసి గ్రామంలోని వైకుంఠధామం, నర్సరీ, పల్లె ప్రకృతి వనాలను పరిశీలించారు. అలాగే పంచాయతీ రికార్డులను కూడా తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పలు కార్యక్రమాలు గ్రామాల్లో చక్కటి ఫలితాలిస్తున్నా యన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ మాధవరెడ్డి, పంచాయతీ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి దివ్య పాల్గొన్నారు.