శామీర్పేట, మే 26: కరోనా విజృంభిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ శ్యామ్సన్ సూచించారు. శామీర్పేట మండలంలోని లాల్గడి మలక్పేట, మూడుచింతల్పల్లి మండలంలోని మూడుచింతల్పల్లి, కేశ్వాపూర్ గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా శ్యామ్సన్ మాట్లాడుతూ కొవిడ్ బాధితుల సహాయార్థం ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం గ్రామాల్లో ఐసొలేషన్ కేంద్రాల ఏర్పాటుకు కృషి చేస్తున్నదన్నారు. అందులో భాగంగానే మూడుచింతల్పల్లి ప్రభుత్వ పాఠశాల, కేశ్వాపూర్ జడ్పీహెచ్ఎస్ను పరిశీలించామన్నారు. ప్రస్తుతం కేశ్వాపూర్లో ఐదు బెడ్లతో కూడిన ఐసొలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, అవసరాన్ని బట్టి మూడుచింతల్పల్లితో పాటు ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేస్తామన్నారు.
కార్యక్రమంలో ఎంపీడీవో సువిధ, సర్పంచ్లు జామ్ రవి, ఇస్తారి, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు. అలాగే శామీర్పేట మండలంలో ఎంపీడీవో వాణి గర్దాస్ అలియాబాద్తో పాటు పలు గ్రామాల్లో బుధవారం పర్యటించి పాజిటివ్ కేసులు, ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలపై ఆశ కార్యకర్తలు, హెల్త్ వర్కర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో సునీత, పంచాయతీ కార్యదర్శులు, హెల్త్వర్కర్లు పాల్గొన్నారు.
కీసర, మే 26: ఐసొలేషన్ కేంద్రం ఏర్పాటు కోసం కీసరలోని బీసీ గురుకుల పాఠశాలను పరిశీలించామని ఎంపీడీవో పద్మావతి తెలిపారు. కీసరగుట్టకు వెళ్లే రోడ్డును ఆనుకొని ఉన్న బీసీ గురుకుల పాఠశాలోని స్థలాన్ని బుధవారం ఎంపీడీవో పద్మావతి, సర్పంచ్ మాధురి వెంకటేశ్, ఎంపీవో మంగతాయారుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ మండలానికి ఒక ఐసొలేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలతో బీసీ గురుకుల పాఠశాలను పరిశీలించామని, ఇక్కడ సుమారు 150 బెడ్లు ఏర్పాటు చేయడానికి స్థలం ఉందన్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే ఏర్పాట్లు చేస్తామన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.