మేడ్చల్ రూరల్, మే 16 : కరోనా బారిన పడిన వారి బాధలు వర్ణణాతీతం. దవాఖానలో చేరి చికిత్స పొందుతున్న వారికి అక్కడి సిబ్బంది సేలందిస్తారు. కానీ హోం ఐసొలేషన్ ఉండే వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. ఒకే ఇంట్లో అందరూ కరోనా బారిన పడితే భోజనం చేసుకోవడం ఇబ్బందికర పరిస్థితి. తీవ్ర నీరసంతో పని చేసుకోలేరు. వృద్ధులైతే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొవిడ్ బాధితుల బాధలను గుర్తించిన గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకోయ పరిధిలో ఉన్న సన్ఫ్లవర్ వేదిక్ స్కూల్ అలాంటి వారికి భోజనం అందజేయాలని సంకల్పించింది. పాఠశాల ప్రిన్సిపాల్ సరితాకుమార్ ఆధ్వర్యంలో బాధితులకు అండగా నిలుస్తున్నారు. ఐసొలేషన్లో ఉన్న చోటుకే భోజనాన్ని చేరవేస్తున్నారు.
కొవిడ్ బాధితులకు తమ వంతుగా సేవ చేయాలన్న సంకల్పంతో ముందుకు వచ్చిన సన్ఫ్లవర్ వేదిక స్కూల్ నిర్వాహకులు అనుకున్నదే తడవుగా తమ సేవకు సంబంధించిన లోగోను రూపొందించి సామాజిక మాద్యమాల ద్వారా ప్రచారం మొదలు పెట్టారు. ఫేస్బుక్, వాట్సాప్ వేదికలుగా ప్రచారం నిర్వహించారు. 8 రోజుల క్రితం బాధితుల నుంచి వచ్చిన రిక్వెస్ట్ను పరిగణలోనికి తీసుకుని భోజనం తయారీ మొదలు పెట్టారు. ప్రతిరోజూ 100 మందికి అల్పహారం, మధ్యాహ్న భోజనాన్ని సరఫరా చేస్తున్నారు.
గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకోయ పరిధిలో ఉన్న సాయిగీతా ఆశ్రమం కేంద్రంగా సన్ప్లవర్ వేదిక పాఠశాల నిర్వాహకులు భోజనాన్ని తయారు చేస్తున్నారు. 15 కిలో మీటర్ల పరిధిలో మేడ్చల్ పట్టణం, మండలంలోని పలు గ్రామాలు, యాప్రాల్, బోయినల్లి, రాజబొల్లారం, బహుదూర్పల్లి, దూలపల్లి తదితర ప్రాంతాలకు ఉదయం అల్పహారం, స్వీట్, సలాడ్, నాలుగు కూరలతో త్వరగా కోలుకోవడానికి అవసరమైన ప్రోటీన్ సహిత భోజనాన్ని అందజేస్తున్నారు. వలంటీర్లు తమకు ఇచ్చిన చిరునామా ఆధారంగా బాధితుల ఇంటి వద్దకు భోజనాన్ని చేర్చి, ఫోన్ చేస్తున్నారు. బాధితులు గేట్ వద్దకు వచ్చి, భోజనాన్ని తీసుకెళ్తున్నారు.
ఇప్పుడు భోజనం అందజేస్తున్న 100 మందికే కాకుండా ఎంత మంది కోరితే అంత మందికి భోజనాన్ని అందజేయాలని నిర్ణయించినట్టు నిర్వాహకులు తెలిపారు. సాయిగీతా ఆశ్రమంతో కలిసి ఈ సేవా కార్యక్రమాన్ని విస్తృతం చేస్తామని తెలిపారు. బాధితులు కోరితే అల్పహారం, మధ్యాహ్న భోజనంతో పాటు రాత్రి పూట భోజనం కూడా సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. 15 కిలో మీటర్ల పరిధిలో ఎవరైనా బాధితులు ఉంటే 9440577707, 9908198624 నంబర్లలో సంప్రదించాలని కోరారు. ఆధార్, పాజిటివ్ రిపోర్టు కూడా జత చేయాలని వారు సూచించారు.