ఘట్కేసర్ రూరల్, జూన్ 15 :ప్రపంచంలో భారతదేశం అగ్రగామిగా నిలబడాలంటే పరిశోధనలు అత్యవసరమని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. అంకుషాపూర్లోని ఇబ్రహీంపట్నం సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ మహిళా కళాశాలను ఆయన మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఇ-మ్యాగజైన్, వార్షిక నివేదికలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… విద్యార్థులందరినీ పరిశోధనల వైపు ప్రోత్సహించాలని కోరారు. పోటీ ప్రపంచంలో తట్టుకుని నిలబడే విధంగా విద్యార్థుల ఉజ్వల భవిష్యత్కు బాటలు వేసేలా ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ డాక్టర్ ప్రవీణ్ మామిడాల, జోనల్ కోఆర్డినేటర్ రజని, ఇబ్రహీంపట్నం కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ, ఉపాధ్యాయులు హేమమాలిని, పద్మావతి, మల్యాల విష్ణుప్రియ పాల్గొన్నారు.