మేడ్చల్ ఆగస్టు 24(నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లిలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిర్వహించిన దీక్షకు అడుగడుగునా నిరసనలు వెళ్లువెత్తాయి. మూడు చింతలపల్లి మండలంలోని వివిధ గ్రామాల ప్రజలతో పాటు టీఆర్ఎస్ నాయకులు రేవంత్ నిర్వహించే దీక్షను వ్యతిరేకిస్తూ ‘గో బ్యాక్,, గో బ్యాక్’ అంటూ నినాదాల హోరెత్తింది. దత్తత తీసుకున్న గ్రామాలు అభివృద్ధి సాధించినందున ఉమ్మడి శామీర్పేట, మూడు చింతలపల్లి మండలాల్లోని ఏడు గ్రామాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటాలకు క్షీరాభిషేకాలు నిర్వహించారు. రాజకీయ లబ్ధి కోసమే రేవంత్ దీక్ష పేరిట అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేయొద్దంటూ ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ శాంతియుతంగా నిరసనలు చేపట్టారు. దత్తత గ్రామాల్లో రూ.69 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు 98 శాతం పనులు పూర్తి అయినట్లు దత్తత గ్రామాల ప్రజలు, ప్రజా ప్రతినిధులు స్పష్టం చేశారు. రేవంత్ దీక్షకు నిరసనగా గ్రామస్తుల సహకారంతో లాల్గడి మలక్పేట, జగ్గంగూడ, కేశవరం, నాగిశెట్టిపల్లి, పోతారం చౌరస్తా, మూడు చింతలపల్లి గ్రామాల్లో నిరసన దీక్షలను టీఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు చేపట్టారు. దీక్ష శిబిరాల్లో అభివృద్ధి జరిగిన వివరాల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టిన దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్షకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు డుమ్మా కొట్టారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో రేవంత్రెడ్డి ప్రాతినిధ్యాన్ని సీనియర్లు వ్యతిరేకిస్తున్నట్లు బహిర్గతమైంది. రాష్ట్రంలోని అనేక జిల్లాల నుంచి రావాల్సిన కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు రాకపోవడం కాంగ్రెస్ శ్రేణులను విస్మయానికి గురిచేసింది. కాంగ్రెస్ నాయకులైన మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మధు యాష్కీ, పొన్నాల లక్ష్మయ్య, మహ్మద్ అజారుద్దీన్, గీతారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, మహేష్ కుమార్ గౌడ్ మినహా మొదటి రోజు దీక్షకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాకపోవడం గమనార్హం.
మూడు చింతలపల్లిలో నిర్వహించిన రేవంత్ దీక్షకు ప్రజల మద్దతు కరువైంది. భారీ సంఖ్యలో దీక్షకు ప్రజలు హాజరవుతారని ఆశించిన కాంగ్రెస్ శ్రేణులకు నిరాశే ఎదురయ్యింది. వేల సంఖ్యలో మాత్రమే జనం హాజరయ్యారు. జన సమీకరణ భారీగా ఏర్పాట్లు చేసినప్పటికీ ప్రజలు దీక్షకు వచ్చేందుకు నిరాసక్తి చూయించారు. సభకు వచ్చేందుకు ఒక్కరికి రూ.300 నుంచి 500లు ఒక పులిహోరా ప్యాకెట్లు ఇచ్చి జన సమీకరణ చేయాలని చేసిన ప్రయత్నం విఫలమైంది. భారీ సంఖ్యలో ప్రజలు దీక్షకు వస్తారని అంచనా వేసి భారీ ఎత్తున ఏర్పాట్లు చేసినప్పటికీ అనుకున్న మేర ప్రజలు రాలేకపోయారు. దీక్షలో వక్తలు ప్రసంగిస్తున్న సమయంలోనే సభ నుంచి జనం వెళ్లిపోయారు. రేవంత్ రెడ్డి ప్రసంగించే సమయానికి సభలో తక్కువ జనం ఉండటంతో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. దీంతో నాయకులు మైకుల ద్వారా ప్రజలను సభా స్థలికి పిలించారు. రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన దీక్షకు వచ్చిన జనాలను చూస్తుంటే మండల స్థాయి సమావేశంగా జరిగిందని పలువురు చర్చించుకున్నారు.