ప్రాథమిక స్థాయిలో చిన్నారులు బడికి వెళ్లేందుకు మారాం చేస్తుంటారు. ఏదో సాకు చెప్పి గైర్హాజరు అవుతుంటారు. వారిని బుజ్జగించి పాఠశాలకు పంపేందుకు తల్లిదండ్రులు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. వాటికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం వినూత్న ఆలోచనతో పిల్లలు ఆసక్తిగా బడికి వచ్చేలా కొత్త కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది. ఆసక్తికర బోధన, పిల్లలు సులువుగా అర్థం చేసుకునే విధంగా ఉండనున్నది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇలాంటి దృశ్యాలు కేవలం ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో కనిపించే అవకాశం ఉందనే భావనను చెరిపేస్తూ ప్రభుత్వం పాఠశాలలో సైతం ఈ తరహా వాతావరణం కనిపించేలా ‘హరివిల్లు’ అనే కార్యక్రమాన్ని రూపొందిస్తున్నది. ఈ మేరకు విద్యాశాఖ అన్ని చర్యలు చేపట్టింది. ఇప్పటికే మాస్టర్ ట్రైనర్స్కు శిక్షణ ఇచ్చారు. వారు జిల్లాలోని ప్రాథమిక పాఠశాలల్లో బోధిస్తున్న ఎస్జీటీలకు ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు ఆన్లైన్లో శిక్షణ ఇవ్వనున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఈ విధానాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది.
ప్రభుత్వ పాఠశాలల్లో బోధన, విద్యార్థుల హాజరుపై ప్రజల్లో అనేక సందేహాలున్నాయి. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు నూతన పోకడలతో విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్షిస్తుండడంతో ప్రతి ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు లేక జీరో ఎన్రోల్మెంట్ పేరుతో చాలా పాఠశాలలు మూత బడుతున్నాయి. అదేవిధంగా గత ఏడాది నుంచి కరోనాతో ప్రత్యక్ష బోధన లేక చిన్నారులు చదువుకు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో పిల్లలను ఆకర్షించడానికి, పాఠశాల వైపు మళ్లించడానికి ‘హరివిల్లు జాయ్ ఫుల్ లర్నింగ్’ పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలల్లో మాత్రమే ఈ విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు.
ప్రాథమిక స్థాయిలో 1,2 తరగతులను మొదటి స్థాయిగా, 3,4,5 తరగతులను రెండో స్థాయిగా విభజించి నిత్యం బడికి హాజరయ్యేలా బోధనలో మార్పు తీసుకువస్తున్నారు. సోమవారం మానసిక సంసిద్ధత, మంగళ, బుధవారాల్లో కథలు చెప్పడం, గురు,శుక్ర వారాల్లో 1,2 తరగతులకు సమన్వయ కృత్యాలు, శనివారం 3,4,5 తరగతి పిల్లలకు భావ వ్యక్తీకరణ అంశాలపై బోధన అందించనున్నారు. మానసిక ప్రశాంతత కోసం ధ్యానంపై అవగాహన కల్పిస్తారు. విద్యార్థులో ఏకాగ్రత పెంపొందించడం, మానసికంగా సిద్ధం చేయడం, చిన్న చిన్న ఆసనాలు వేయించడం, కథలు చెప్పడం, విభిన్న రీతుల్లో ఆటలు,పిల్లల్లో నాయకత్వ లక్షణాలు, కృత్యాలు చేయించడం వంటి కార్యక్రమాలను అమలు చేయనున్నారు.
నేటి నుంచి ఆన్లైన్లో శిక్షణ…
ఇప్పటి వరకు రాష్ట్రంలో జోగుళాంబ గద్వాల్, మహబూబ్నగర్, వికారాబాద్ జిల్లాల్లో మాత్రమే ఎంపిక చేసిన పైలట్ ప్రాజెక్ట్గా హరివిల్లును అమలు చేశారు.అక్కడ విజయవంతం కావడంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని జిల్లాల్లో అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలానికి ఇద్దరు చొప్పున 22 మండలాలకు 44 మంది రిసోర్స్ పర్సన్లకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. వీరు జిల్లాలోని 1824 మంది ఉపాధ్యాయులకు మొదటి దఫాలో ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు 5 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. రెండు బ్యాచ్లుగా విభజించి ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, రెండో బ్యాచ్కు మధ్యాహ్నం 1.30 నుంచి 4 గంటల వరకు ఆన్లైన్లో శిక్షణ ఇవ్వనున్నారు. రెండో దఫాలో ఈ నెల 15 నుంచి 20వ తేదీ వరకు మిగిలిన ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నారు.
ఇవీ కూడా చదవండి…
కులవృత్తులకు ప్రభుత్వం పెద్దపీట