కుత్బుల్లాపూర్, మే9 : చెత్తరహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు కుత్బుల్లాపూర్ సర్కిల్ అధికారులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజల్లో నూతనంగా మార్పులు తీసుకొచ్చేందుకు కొత్త పద్ధతులను అవలంభిస్తున్నారు. దానిలో భాగంగా ప్రధానంగా చెత్తను ప్రజలు విచ్చలవిడిగా వేసే ప్రాంతాలను ఎంచుకొని అక్కడ పొడవాటి కర్రలను ఏర్పాటు చేసి, మినీగార్డెన్ మాదిరిగా మొక్కలు నాటుతున్నారు. శనివారం కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వరనగర్ కాలనీకి వెళ్లే మార్గం గుండా ప్రధాన ఓపెన్ నాలాకు ఆనుకొని ఉన్న ప్రాంతం లో నిత్యం ఎవరో ఒకరు చెత్తను వేసి వెళ్తున్నారు. గతం లో ఇలాంటి ప్రాంతాలను శుభ్రం చేసి చెత్త వేయొద్దంటూ ముగ్గులు వేసే కార్యక్రమాన్ని చేపట్టారు. అయినప్పటికీ ప్రజల్లో మార్పులు రాకపోవడంతో ఇప్పుడు కొత్తగా మొక్కలు నాటి అవగాహన కల్పిస్తున్నారు. సర్కిల్ కార్యాలయం పరిధిలో ప్రధానంగా ఎక్కడెక్కడైతే ఓపెన్ ప్రాం తాలు ఉంటాయో అక్కడ శుభ్రం చేసి టెంట్ వేసుకొని లాఠీ.. సిఠితో గతంలో కొన్ని రోజులు చెత్త వేయకుండా నేరుగా ఇంటింటికీ వచ్చే స్వచ్ఛ ఆటోల్లోనే వేసేలా ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు.
బహిర్గత చెత్తతో ప్రజలకు కలిగే ముప్పును నివారించడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా ‘మనం మారుదాం.. మన నగరాన్ని మార్చుకుందాం’ అనే నినాదంతో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నగరాన్ని దినదినం సుందరీకరణగా తీర్చిదిద్దేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా నగర శివారు ప్రాంతాల్లో విచ్చలవిడిగా చెత్తను బహిర్గత ప్రాంతాల్లో కుప్పలు తెప్పలుగా చేయడం ద్వారా కుక్కలు, పందులతో స్వైరవిహారం చేసి అంధవికారంగా మారి అనేక ఇబ్బందులు తలెత్తాయి. ఈ మేరకు గత కొంతకాలంగా బహిర్గత ప్రాంతాల్లో పూర్తిగా చెత్తడంప్ కుండీలను తొలగించి, వాటి ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ పలు పద్ధతుల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. దానిలో భాగంగానే ఇప్పుడు మొక్కలు నాటి.. ఆ ప్రాంతాలను మినీ గార్డెన్లుగా మార్చేందుకు కుత్బుల్లాపూర్ సర్కిల్ అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు.