తిమ్మాపూర్ (మానకొండూర్ రూరల్), మార్చి 2: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఉద్ఘాటించారు. కరోనాతో వివిధ పథకాల లబ్ధిదారులు బయటకు వచ్చే పరిస్థితులు లేకపోవడంతో వారి ఇండ్ల వద్దే సాయం అందిస్తున్నదని పేర్కొన్నారు. బుధవారం తిమ్మాపూర్ మండల కేంద్రంతో పాటు కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని అల్గునూర్, మండలంలోని ఇందిరానగర్, నుస్తులాపూర్, నల్లగొండ, పర్లపల్లి, మల్లాపూర్, మన్నెంపల్లి, పొరండ్ల గ్రామాల్లో తెల్లవారు జాము నుంచే ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల ఆయన మాట్లాడారు. దేశంలోనే ఎక్కడా లేని పథకాలను అమలు చేస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తున్నామని గుర్తు చేశారు.
పర్యటనలో భాగంగా సీఎంఆర్ఎఫ్, కల్యాణ లక్ష్మి లబ్ధిదారుల ఇండ్లకు స్వయంగా వెళ్లిన ఎమ్మెల్యే, వారికి చెక్కులను అందించారు. వీధుల్లో వృద్ధులతో ఆప్యాయంగా మాట్లాడారు. స్థానికంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. మల్లాపూర్ గ్రామంలో సాగునీటి కాల్వలను వెంటనే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కాల్వల నిర్మాణానికి గ్రామస్తులు సైతం సహకరించాలని కోరారు. భూమి కోల్పోయిన రైతులకు పరిహారం అందేలా చూస్తానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఇఫ్కో రాష్ట్ర డైరెక్టర్ కేతిరెడ్డి దేవేందర్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రావుల రమేశ్, రైతు బంధు సమితి కన్వీనర్ సాయిల్ల కొమురయ్య, కేడీసీసీబీ డైరెక్టర్ సింగిరెడ్డి స్వామి రెడ్డి, కార్పొరేటర్ సల్ల శారద-రవీందర్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షులు, నాయకులు ప్గాలొన్నారు.
గన్నేరువరం, మార్చి 2: మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలను సుడా సహకారంతో మరింత అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. బుధవారం సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావుతో కలిసి గోపాలపూర్, హన్మాజిపల్లి, జంగపెల్లి, ఖాసీంపేట, మైలారం, గన్నేరువరం గ్రామాల్లో పర్యటించారు. ముందుగా వారికి టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంప వెంకన్న ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తన కోరిక మేరకు సుడా చైర్మన్ జీవీఆర్ రూ.70 లక్షల నిధులను మంజూరు చేశారని తెలిపారు. వీటితో హన్మాజిపల్లి ఎక్స్రోడ్డు సుందరీకరణ, గన్నేరువరంలో అంబేద్కర్ విగ్ర హం నుంచి కిలోమీటర్ మేర సెంట్రల్ లైటింగ్, మైలారంలోని మల్లికార్జున స్వామి ఆలయ సుందరీకరణతో పాటు ఖాసీంపేట నుంచి మానసాదేవి ఆలయం వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. నిధులు మంజూరు చేసిన సుడా చైర్మన్కు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.