మేడ్చల్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ) : పచ్చదనం పెంపునకు మరిన్ని బృహత్ ప్రకృతి వనాల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధమైంది. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా బృహత్ ప్రకృతి వనాల ఏర్పాటుకు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, మండలాల పరిధిలో స్థలాలను ఎంపిక చేశారు. కార్పొరేషన్, మున్సిపాలిటీ పరిధిలో ఎకరం నుంచి 5 ఎకరాల లోపు స్థలాలను ఎంపిక చేయగా మండలాల్లో 8 ఎకరాల స్థలాలను ఎంపిక చేసి సంబంధిత అధికారులకు అప్పగించారు. దీంతో బృహత్ పకృతి వనాల ఏర్పాట్లను ప్రారంభించారు. మండలాలకు సంబంధించిన జిల్లాలోని 13 మున్సిపాలిటీ, కార్పొరేషన్లు అయిన పీర్జాదిగూడ, బొడుప్పల్, జవహర్నగర్, నిజాంపేట్, ఘట్కేసర్, పోచారం, గూండ్లపోచంపల్లి, మేడ్చల్, నాగారం, దమ్మాయిగూడ, తూంకుంట, దుండిగల్, కొంపల్లిలలో స్థలాలను ఎంపిక పూర్తి చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. జిల్లాలోని 5 మండలాలకు సంబంధించి మండలాల వారీగా శామీర్పేట్ మండలం (బొమ్మరాసిపేట్) ఘట్కేసర్ మండలం(కచవాని సింగారం) మూడుచింతలపల్లి(జగన్గూడ) కీసర, మేడ్చల్ మండలాలలో స్థలాల ఎంపిక కాగా బృహత్ ప్రకృతి వనాల పెంపులో ఇప్పటికే మండలాలకు సంబంధించి ఘట్కేసర్ మండలం(కాచవాని సింగా రం) మూడుచింతలపల్లి మండలం (జగన్గూడ)లో ప్రకృతి వనాల పనులు ప్రారంభమయ్యాయి.
మున్సిపాలిటీల పరిధిలో బృహత్ ప్రకృతి వనాల ఏర్పాటుకు మున్సిపాలిటీల నుంచి నిధులు ఖర్చు చేయగా మండలాలలో ఈజీఎస్ నిధులు ఖర్చు చేయనున్నారు. బృహత్ ప్రకృతి వనాల ఏర్పాట్లకు స్థలాల ఎంపిక పూర్తై సంబంధిత అధికారులకు అప్పగించడంతో పనులను త్వరితగతిన చేపట్టాలని అధికారులు ఆదేశించారు. ప్రకృతి వనాలలో పిల్లలకు పార్కులు, వాకింగ్ట్రాక్లు, సేదతీరేందుకు బెంచీలను ఏర్పాటు చేయనున్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తూ అటవీ పెంపుపై ప్రత్యేక దృష్టి సారించింది. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి హరితహారం కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలను భాగస్వాములను చేస్తూ విజయవంతం చేస్తున్నారు. హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యతలను ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు తీసుకోవడంతో హరితహారం, పల్లె, పట్టణ ప్రకృతి వనాల ఏర్పాటు ప్రణాళిక విజయంతంగా అమలవుతుంది. మేడ్చల్ జిల్లాలో హరితహారం కార్యక్రమాలలో రాష్ట్రంలోనే ఆరు మున్సిపాలిటీలు ఎంపికై మేడ్చల్ జిల్లా ఆదర్శంగా నిలిచింది.