శామీర్పేట, మే 13: కరోనా విపత్కర కాలంలో సీఎం కేసీఆర్ రైతులకు కొండంత అండను ఇస్తున్నారని టీఎస్ కాబ్ చైర్మన్, అఖిల భారత కో ఆపరేటివ్ బ్యాంకు సమాఖ్య అధ్యక్షుడు కొండూరు రవీందర్ రావు పేర్కొన్నారు. గురువారం శామీర్పేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని సందర్శించి, వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేసి, ధాన్యం కొనుగోళ్లు తదితర విషయాలను డీసీఎంఎస్ వైస్ చైర్మన్ రామిడి మధుకర్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు చేసిన ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కాలంలో రైతులు ఇబ్బందులు పడొద్దని సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారన్నారు. సకాలంలో డబ్బులు కూడా చెల్లించేందుకు చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఎంఏవో రమేశ్, సీఈవో నర్సింహులు, సహకార సంఘం డైరెక్టర్ భూంరెడ్డి, ఏఈవో రవి పాల్గొన్నారు.