మేడ్చల్, అక్టోబర్17(నమస్తే తెలంగాణ): వానాకాలం(ఖరీఫ్) వరి ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. రైతులను సంబురపరిచింది. యాసంగిలో రైతు ముంగిట్లోనే కొనుగోలు చేసిన విధంగా ఖరీఫ్ సీజన్లో పండిన ధాన్యం కొనుగోళ్లకు సీఎం కేసీఆర్ ఉత్వర్వులు జారీ చేయడంతో రైతన్నల నుంచి సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా వానాకాలంలో 18,428 ఎకరాల్లో వరి సాగు చేశారు. వ్యవసాయాధికారులు 30 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ నెల చివరి వారం నుంచి ధాన్యం రైతుల చేతికి అందనుండటంతో నవంబర్ మొదటి వారం నుంచి ధాన్యం కొనుగోళ్లు చేపట్టేందుకు ఫౌరసరఫరాల శాఖ ఇటీవలే ప్రణాళికను రూపొందించింది. దిగుబడుల అంచనా మేరకు ధాన్యం కొనుగోళ్లకు సరిపడ గోనెసంచులు, రవాణా ఏర్పాట్లపై ముందస్తు ఏర్పాట్లు చేయనున్నారు. జిల్లా ఫౌరసరఫరాలు, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులు సమన్వయంతో ధాన్యం కొనుగోళ్లు చేయనున్నారు.
వరి ధాన్యానికి మద్దతు ధరను ప్రభుత్వం నిర్ణయించింది. గ్రేడ్-ఎ రకానికి రూ.1960, కామన్ రూ. 1940గా నిర్ణయించారు. రైతులు పండించిన ధాన్యానికి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి కొనుగోళ్లు చేయనుంది. కొనుగోళ్లకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లకు సుమారు రూ. 60 కోట్ల పైచిలుకు పైగా రైతులకు చెల్లించాల్సి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన నగదును నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో వేయనున్నారు.
గత యాసంగిలో రైతుల వద్ద నుంచి 28 వేల 615 మెట్రిక్ టన్నుల ధ్యాన్యాన్ని కొనుగోలు చేసిన ప్రభుత్వం రైతులకు రూ. 53 కోట్ల 68 లక్షలను చెల్లించింది. జిల్లాలోని ఘట్కేసర్ మండలం మాదారం, ఎదులాబాద్, ప్రతాపసింగారం, మూడుచింతలపల్లి మండలం లక్ష్మాపూర్, కేశవరం, ఉద్దమర్రి, కీసర మండలం,కీసర , మేడ్చల్ మండలం మేడ్చల్, పూడూర్, డబిల్పూర్, శామీర్పేట్ మండలం శామీర్పేట్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఫౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ రాజేందర్ వెల్లడించారు.
పండించిన పంటలకు మద్దతు ధర ఇస్తూ దళారుల మోసాలకు రైతులు గురికాకుండా ప్రభుత్వం కాపాడుతున్నది. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి రైతులకు వ్యవసాయం పండుగలా మారింది. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను ప్రవేశపెట్టి రైతులకు అండగా నిలిచారు. వ్యవసాయానికి నాణ్యమైన కరెంట్ అందించిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుంది.-ఇంద్రకరణ్రెడ్డి, రైతు, కేశవరం
వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయం. రైతు లు పండించిన ధాన్యానికి మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయడం రైతుల అదృష్టంగా భావిస్తున్నాం. రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయనున్నది.-కంటం కృష్ణారెడ్డి , రైతుబంధు అధ్యక్షుడు, శామీర్పేట్ మండలం