మేడ్చల్, మే 31 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా 12 కొనుగోలు కేంద్రాల ద్వారా 18,213 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ప్రభు త్వం కొనుగోలు చేసింది. కొనుగోలు చేసిన ధాన్యానికి రూ. 24.54 కోట్లను 2,674 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. యాసంగిలో 13,165 ఎకరాల్లో వరిని సాగు చేయగా.. పండించిన పంటను ఇంటి ముంగిటే కొనుగోలు చేస్తున్న ప్రభుత్వంపై రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఏప్రిల్ 26న ప్రారంభించిన వరి ధాన్యం కొనుగోలు మరో వారం రోజుల్లో పూర్తి కానున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 85శాతం ధాన్యం కొనుగోలు పూర్తి అయ్యిందని.. మరో 15 శాతం త్వరలోనే పూర్తిచేస్తామని అధికారులు తెలిపారు. మార్క్ఫెడ్, డీసీఎంఎస్, ఫౌరసరఫరాల శాఖలు సంయుక్తంగా ధాన్యం కొనుగోలు చేపట్టాయి.
వానాకాలం పంటల సాగుకు మేడ్చల్ జిల్లా వ్యవసాయాధికారులు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. గత రెండు సంవత్సరాలుగా భారీ వర్షాలు కురువడంతో అధికంగా వరి సాగు విస్తీర్ణం చేశారు. అయితే వానాకాలంలో వరికి బదులు పత్తి, కందులకు భారీగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఆ పంటలను సాగు చేయించే విధంగా రైతులతో సమావేశాలు నిర్వహించేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. అలాగే.. కూరగాయల సాగు విస్తీర్ణం పెంచేందుకు ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో రైతులకు పూర్తి సహకారం అందజేస్తున్న విషయం తెలిసిందే.